GVL : బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ .. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ ను టార్గెట్ చేశారు. వాళ్లిద్దరి వైఖరి నచ్చకే పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. కన్నా వ్యాఖ్యలపై జీవీఎల్ ఘాటుగా స్పందించారు. ఆయనకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం పార్టీ కల్పించిందని తెలిపారు. జాతీయ కార్యవర్గంలో చోటు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా బీజేపీ కన్నాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు.
బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ దురుద్దేశంతోనే పార్టీ నేతలపై కన్నా విమర్శలు చేశారని జీవీఎల్ మండిపడ్డారు. సోము వీర్రాజుపై కన్నా చేసిన విమర్శలపైనా స్పందించారు. సోము వీర్రాజు అధిష్టానంతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. తనపై కూడా గతంలోనూ కన్నా విమర్శల చేసిన విషయాన్ని జీవీఎల్ గుర్తు చేశారు. తన పరిధిలో తాను పని చేస్తున్నానని చెప్పారు. బయట పార్టీ నుంచి వచ్చినప్పటికీ కన్నాకు కీలక పదవులు ఇచ్చారన్నారు. ఇది బీజేపీలో చాలా గొప్ప విషయంగా పేర్కొన్నారు.
సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్లడం లేదని కన్నా విమర్శించారు. రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చకనే తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. సోము వీర్రాజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అదే సమయంలో జీవీఎల్ పైనా కన్నా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కన్నాకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు.