Kanna Laxminarayana : బీజేపీకి గుడ్ బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 23 లేదా 24న పసుపు కండువా కప్పుకుంటారని టాక్ గట్టిగా వినపడుతోంది. ఈ విషయాన్ని రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 10 రోజుల క్రితమే హైదరాబాద్ లో కొందరు టీడీపీ నేతలతో కన్నా చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అనుచరులతో చర్చించి బీజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. కన్నాకు టీడీపీ నుంచి స్పష్టమైన హామీ లభించిన తర్వాతే బీజేపీకి రాజీనామా చేశారు. ఇక టీడీపీలో చేరడం లాంఛనమే అని అంటున్నారు.
అక్కడ నుంచే పోటీ..?
టీడీపీలో చేరితే కన్నా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై జోరుగా ప్రచారం సాగుతోంది. గుంటూరు వెస్ట్ స్థానం నుంచి బరిలోకి దిగడం ఖాయమని కొందరు అంటున్నారు.పెదకూరపాడు లేదా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారని మరికొందరు చెబుతున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ 4సార్లు పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పెదకూరపాడు నుంచి గుంటూరు వెస్ట్ కు మారారు. 2009 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదుగురు ముఖ్యమంత్రుల కేబినేట్ లో మంత్రిగా కన్నా పనిచేశారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కానీ వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ వైపు ఆయన వెళ్లలేదు. వైసీపీలో చేరేందుకు ప్రయత్నించలేదు. ఆ దిశగా వైసీపీ అధిష్టానంతో ఎప్పుడూ చర్చలు జరిపిన దాఖలాలు కనిపించలేదు.
టీడీపీని వ్యతిరేకించి..
తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి టీడీపీకి బద్ద వ్యతిరేకిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. చంద్రబాబు రాజకీయ విధానాలను కన్నా ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పూల్లారావుతో మంచి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. కన్నా ఇప్పుడు టీడీపీ వైపు అడుగులు వేయడం ఆసక్తిని రేపుతోంది. కన్నా రాజకీయ శత్రువు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోనే ఉన్నారు. వారిద్దరూ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నో వివాదాలు నడిచాయి. కన్నా టీడీపీలో చేరితే ఆయన కోరుకున్న ప్రాధాన్యత లభిస్తుందా? ఆ పార్టీలో ఇమడగలుగుతారా? మరోమార్గం లేకే ఇక టీడీపీ గడప తొక్కుతున్నారా? జనసేనలో చేరతారని టాక్ వచ్చినా ఎందుకు అటు వైపు అడుగులు వేయటంలేదు..?