Pakistan:మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.120కి, లీటర్ డీజిల్ ధర రూ.110కి చేరితేనే జనమంతా గగ్గోలు పెట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల్ని భారీగా పెంచిన కేంద్ర ప్రభుతాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత కేంద్రం కాస్త కరుణించి ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడంతో లీటర్ పెట్రోల్ రూ.110కి, లీటర్ డీజిల్ రూ.100కి దిగివచ్చాయి. అయినా ఇప్పటికీ జనం పెట్రోల్, డీజిల్ ధరల్ని భారంగానే చూస్తున్నారు. మన దగ్గర ఇలా ఉంటే… దాయాది దేశం పాకిస్థాన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ తాజాగా లీటర్ పెట్రోల్ ధర రూ.272కు, లీటర్ డీజిల్ ధర రూ.196కు చేరింది. ఐఎంఎఫ్ నుంచి కొత్త అప్పు తెచ్చుకునేందుకు… జనాన్ని తిప్పలు పెడుతోంది… పాకిస్థాన్ ప్రభుత్వం.
ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రం కావడంతో… ఐఎంఎఫ్ నుంచి బెయిలవుట్ ప్యాకేజీ తెచ్చుకోవడానికి నానా పాట్లూ పడుతున్నారు… పాకిస్థాన్ పాలకులు. భారీగా పన్నులు పెంచుతూ మినీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే… పెట్రోల్, డీజిల్ ధరలను కూడా భారీగా పెంచారు. తాజాగా లీటర్ పెట్రోల్ ధరపై రూ.22.20 పెంచడంతో… అది కాస్తా రూ.272కు చేరింది. ఇక లీటర్ డీజిల్ ధరపై రూ.9.68 పెంచడంతో అది రూ.196.68గా మారింది. లీటర్ కిరోసిన్ ధర కూడా రూ.12.90 పెరిగి రూ.202.73కు చేరింది. కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చేశాయి కూడా.
అప్పు ఇవ్వాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని పెంచాలని ఐఎంఎఫ్ షరతు విధించడంతో… గత్యంతరం లేని పరిస్థితుల్లోనే రేట్లు పెంచామంటున్నారు… పాక్ పాలకులు. పెట్రో ధరలు పెంచడం వల్ల ఇప్పటికే రికార్డు గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని… కొద్దిరోజుల్లోనే అది 33 శాతానికి చేరే అవకాశం ఉందని మూడీస్ అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఐఎంఎఫ్ బెయిలవుట్ ప్యాకేజీ పాక్ను ఏ మాత్రం గట్టెక్కించలేదని వ్యాఖ్యానించింది. దాంతో… ముందుముందు పాక్ ఆర్థిక పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా మారుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.