New Zealand: మూల్గుతున్న నక్కపై తాటి పండు పడ్డట్లు ఉంది న్యూజిలాండ్ పరిస్థితి. ఓ వైపు తుఫాన్ దెబ్బకు వరదలతో అతలాకుతలమవుతుంటే.. మరోవైపు భూకంపం వణికించింది. బుధవారం వెల్లింగ్టన్ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టంకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
ఇక ఇప్పటికే న్యూజిలాండ్ గాబ్రియేల్ తుఫాన్ దెబ్బకు అల్లాడిపోతోంది. దేశ ఉత్తరభాగం మొత్తం వరదల్లో చిక్కుకుంది. ఇళ్లు నీట మునిగి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రతి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వేల కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా కమ్యూనిటీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
రైల్వే స్టేషన్లు, పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. దేశీయంగా ప్రయాణించాల్సిన 55 విమానాలను రద్దు చేశారు. ఈక్రమంలో అక్కడి ప్రభుత్వం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. 2011లో క్రైస్ట్చర్చ్ భూకంపం, 2020లో కరోనా వ్యాప్తి తర్వాత న్యూజిలాండ్లో అత్యవసర పరిస్థితిని ఇప్పుడే విధించారు.