America : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. తాజాగా టెక్సాస్ లో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో అనుమానితుడి కోసం గాలిస్తున్నారు.టెక్సాస్ లోని ఓ మాల్లో తుపాకీ కాల్పుల ప్రారంభం కాగానే అందులో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు.
గతేడాది మేలో టెక్సాస్లో 18 ఏళ్ల యువకుడు ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం ఈస్ట్ లాన్సింగ్లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్లోకి ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు.
అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు తుపాకీ గుళ్లకు బలవుతున్నారు. విదేశాల నుంచి అమెరికాకు వచ్చి ఉపాధి పొందుతున్న వారు కాల్పుల ఘటనల్లో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అమెరికాలో గన్ కల్చర్ ఎంతో మంది భారతీయుల ప్రాణాలను బలి తీసుకుంది.