Musk:రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా! అనేది మన తెలుగు సామెత. ఇప్పుడు నెటిజన్లు.. మస్క్ తలుచుకుంటే ఎంగేజ్మెంట్లకు కొదవా! అంటున్నారు. కారణం… అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ కంటే తన ట్వీట్కు తక్కువ ఎంగేజ్మెంట్లు రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన మస్క్… ఏకంగా కోడింగ్, అల్గారిథమ్లో మార్పులు చేయించి మరీ తన ట్వీట్లకు ఎక్కువ ఎంగేజ్మెంట్లు తెప్పించుకోవడం.
గత ఆదివారం ఫిలడెల్ఫియా ఈగిల్స్, కాన్సాస్ సిటీ చీఫ్స్ ఫుట్బాల్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా… ఈగిల్స్కు మద్దతుగా మస్క్ ట్వీట్ చేసి, ఓ వీడియో పోస్ట్ చేశారు. బైడెన్ కూడా ఈగిల్స్నే సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. మస్క్ ట్వీట్కు 90 లక్షల ఎంగేజ్మెంట్లు మాత్రమే రాగా… బైడెన్ ట్వీట్కు ఏకంగా 2 కోట్ల 90 లక్షల ఎంగేజ్మెంట్లు వచ్చాయి. తనకన్నా బైడెన్కు మూడు రెట్లు ఎక్కువ ఎంగేజ్మెంట్లు రావడంతో… మస్క్ కుతకుతలాడిపోయాడు. వెంటనే ట్విట్టర్ టెక్కీలను పిలిచి… తన ట్వీట్లకు ఎక్కువ ఎంగేజ్మెంట్లు వచ్చేలా చేయకపోతే… ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో 80 మంది నిపుణులు 24 గంటల్లోపే కోడింగ్, అల్గారిథమ్లో మార్పులు చేసి… మస్క్ ట్వీట్లకు అందరి కంటే ఎక్కువ ఎంగేజ్మెంట్ వచ్చేలా చేశారు. అందుకే గత మూడు రోజులుగా ట్విట్టర్లో మస్క్ ట్వీట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంతైనా బాస్ తలుచుకుంటే జరగనిది లేదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇక, ట్విట్టర్ కొత్త సీఈఓ అంటూ తన పెంపుడు కుక్క ఫోటోను పోస్ట్ చేయడంపై విమర్శలు రావడంతో… మస్క్ వెంటనే స్పందించాడు. ప్రస్తుతానికి సంస్థ సీఈఓగా తాను కొనసాగుతున్నా… కొత్త సీఈఓను ఎప్పుడు నియమించేదీ వెల్లడించాడు. ఈ ఏడాది చివరి నాటికి ట్విట్టర్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ఆ తర్వాతే కొత్త సీఈఓను నియమిస్తానని మస్క్ ప్రకటించాడు. కొత్త సీఈఓను నియమించే సమయానికి… సంస్థ భవిష్యత్ ప్రణాళికలను కూడా సిద్ధంగా ఉంచుతానని చెప్పాడు… మస్క్.