India: ప్రపంచ వ్యాప్తంగా అంతటా లేహాఫ్స్. గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్.. ఏ బడా కంపెనీ తీసుకున్నా ఉద్యోగుల కోతనే కనిపిస్తోంది. వేలాది మందికి పింక్ స్లిప్స్ ఇచ్చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంతో అగ్రరాజ్యాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏకంగా మూడు దేశాలను ఆదుకుంది ఇండియా. ఆయా కంట్రీస్ లో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కావలసినంత బిజినెస్ అప్పగించింది. బాగా ఆకలితో నకనకలాడుతున్న వాడికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినట్టు.. మన దేశం ఇచ్చిన ఆర్డర్స్ తో ఇప్పుడు పండుగ చేసుకుంటున్నాయి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు.
ఇటీవలి ఎయిరిండియా డీల్స్ ఆ మూడు దేశాల పాలిట ఆపన్నహస్తంగా మారింది. బోయింగ్ కంపెనీ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది ఎయిరిండియా. ఈ డీల్ తో అమెరికాలో ఏకంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని.. స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. అమెరికాలోని 44 రాష్ట్రాల్లోని నిపుణులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.
ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ నుంచి 250 విమానాలు కొనేందుకు కూడా ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ తో ఫ్రాన్స్ నెత్తిన కనకవర్షం కురవనుంది. అందుకే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యానియేల్ మేక్రాన్.. వైమానిక రంగంలో ఇదో సరికొత్త విజయం అని సంబరపడుతున్నారు.
ఇక, బ్రిటన్ కంపెనీ రోల్స్రాయిస్ నుంచి విమాన ఇంజిన్ల కొనుగోలుకు సైతం ఎయిరిండియా అగ్రిమెంట్ చేసుకుంది. ఈ డీల్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. తాజా ఒప్పందం.. మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రశంసించారు. యూకేలో అభివృద్ధి చెందుతున్న వైమానిక రంగానికి ఆకాశమే హద్దు అన్నారు.
ఇలా.. టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా.. ఒకేసారి మూడు అగ్రదేశాలను ఆదుకోవడం.. ప్రధాని మోదీకి సైతం మంచి పేరు రావడం.. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా ఇమేజ్ మరింత పెరగడం.. భారతీయులందరికీ గర్వకారణం.