Congress: కాంగ్రెస్ ను ఎవరూ ఓడించనక్కరలేదు.. వారిని వారే ఓడించుకుంటారు.. అనేది నానుడి. అది నిజమే అనేలా ప్రతీసారీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. లేటెస్ట్ పరిణామాలు మరోసారి ఆ డైలాగ్ ను గుర్తుకు తెస్తున్నాయి.
కోమటిరెడ్డి వ్యాఖ్యలు రెండు రోజులుగా ఫుల్ కాంట్రవర్సీ అవుతున్నాయి. కాంగ్రెస్ కు మెజార్టీ రాదు.. కేసీఆర్, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలి.. అంటూ నానా రచ్చ రగిలించారు. అంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డిపై సీరియస్ యాక్షనే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఎప్పటిలానే మళ్లీ లైట్ తీసుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్. ఎంపీ కోమటిరెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్ానరంటూ.. ఆయన పార్టీ లైన్ లోనే ఉన్నారంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. రాహుల్గాంధీ మాటలకు కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఇలా అంత పెద్ద వివాదాన్ని.. సింపుల్ గా సరిపెట్టేశారు. అందుకే కాబోలు, తనను అధిష్టానం ఏం చేయలేదనే ధీమాతోనే కోమటిరెడ్డి తరుచూ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటు చేసుకున్నారని.. కాంగ్రెస్ లో అలానే ఉంటుందని అంటున్నారు.
గాంధీభవన్లో టీపీసీసీ ఉపాధ్యక్షులతో సమావేశమయ్యారు ఇంచార్జ్ థాక్రే. ఈ మీటింగ్ కి 34 మంది ఉపాధ్యక్షులు హాజరు కావాల్సి ఉంది.. కానీ, వచ్చింది కేవలం 9 మంది మాత్రమే. ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంత సీరియస్ గా పాదయాత్ర చేస్తూ పార్టీ కోసం కష్టపడుతుంటే.. ఉపాధ్యక్ష పదవులు అనుభవిస్తున్నా నేతలేమో ఇలా మీటింగ్ కే రాకుండా డుమ్మా కొడుతూ.. ఉదాసీనంగా ఉండటం కాంగ్రెస్ లోనే సాధ్యం అంటున్నారు. సమయం లేదు మిత్రమా అని రేవంత్ రెడ్డి ఎంతగా ఆరాటపడుతున్నా.. వీళ్లేమో ఇంకా మొద్దు నిద్రలోనే జోగుతుండటంపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. థాక్రే సైతం గౌర్హాజరైన ఉపాధ్యక్షులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎందుకు రాలేదో వివరణ అడగాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సూచించారు. శుక్రవారం మరోసారి ఉపాధ్యక్షులతో సమావేశం ఉంటుందని చెప్పారు.
మాణిక్ రావు థాక్రేతో మీటింగ్ లో కొందరు ఉపాధ్యక్షులు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇంకోసారి మాట్లాడదామని వారికి సర్ది చెప్పి విషయాన్ని అక్కడితో ముగించేశారు.
ఇక రేవంత్ పాదయాత్రలో పలువురు సీనియర్లు హాజరు కాకపోవడాన్నీ కవర్ చేశారు. కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్ ఇన్ఛార్జ్లుగా ఉన్న వారిని మార్చాల్సి ఉంటుందని హెచ్చరించారు థాక్రే.