Revanth Reddy: తెలంగాణలో హిందుత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ అయితే ఏకంగా హిందుత్వ ఎజెండాతోనే మనుగడ సాగిస్తోంది. కమలనాథులకు పోటీగా బీఆర్ఎస్ సైతం దూకుడు మీదుంది. ఇప్పటికే యజ్ఞాలు, యాగాలతో సీఎం కేసీఆర్ పక్కా హిందుత్వ మెసేజ్ చాటారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించి అందరినీ అబ్బురపరిచారు. లేటెస్ట్ గా కొండగట్టు అంజన్న ఆలయానికి ఏకంగా 600 కోట్లు ప్రకటించి.. మరింత ఆశ్చర్యపరిచారు. ఇలా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ హిందుత్వ రేసులో.. కాంగ్రెస్ మాత్రం బాగా వెనకబడే ఉంది. ఈ విషయం గుర్తించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తన పాదయాత్రలో భాగంగా భద్రాచలంలో ప్రసంగిస్తూ.. ఆసక్తికర హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో 100 నియోజకవర్గాల్లో 100 రామాలయాలు నిర్మిస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఒక్కో ఆలయానికి 10 కోట్లు కేటాయిస్తామని.. మొత్తం 1000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రామాలయాలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ చేసిన ఈ ప్రకటనే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
సడెన్ గా రేవంత్ రెడ్డి.. జై శ్రీరాం అంటూ.. 100 రామాలయాలంటూ.. హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీకి బ్రాండ్ స్లోగన్ గా మారిన జై శ్రీరాం నినాదానికి కౌంటర్ గానే.. కాంగ్రెస్ సైతం రామాలయాల స్ట్రాటజీ తీసుకొచ్చిందా? అనే చర్చ నడుస్తోంది. అటు, సీఎం కేసీఆర్ సైతం యాదాద్రి, కొండగట్టులతో హిందుత్వాన్ని బలంగా చాటుతుండగా.. అది గమనించిన రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారని.. అందుకే భద్రాచలం రాముడి సాక్షిగా.. తెలంగాణలో 100 రామాలయాల ప్రకటన చేశారని అంటున్నారు.
రేవంత్ చేసిన ఈ ప్రకటన.. బీజేపీ, బీఆర్ఎస్ లను షేక్ చేస్తోంది. 100 నియోజకవర్గాలు, 100 రామాలయాలు అంటే మాటలా? ఊరూరా జై శ్రీరాం నినాదం వినిపిస్తుంది.. రాముడి పేరుతో పాటే.. కాంగ్రెస్, రేవంత్ పేరు కూడా మారిమోగిపోతుందని అంటున్నారు. అయితే, రేవంత్ ప్రకటనకు కాంగ్రెస్ ఆమోదం ఉందోలేదో తెలీదు కానీ.. ఆయన చేసిన ఈ స్టేట్ మెంట్ మాత్రం పొలిటికల్ గా ఫుల్ వర్కవుట్ అయ్యేలానే కనిపిస్తోంది.