Revanth Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూటకో మాట మార్చేస్తున్నారు. ముందేమో తెలంగాణలో హంగ్ వస్తుంది.. కేసీఆర్, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిందేనంటూ కలకలం రేపారు. ఆ కామెంట్లు కల్లోలంగా మారగా.. తూచ్ నేనలా అనలేదంటూ మాట మార్చేశారు. బీజేపీనే తన వ్యాఖ్యలను వక్రీకరించిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. తన సర్వేల్లో అలా వచ్చిందంటూ కవర్ చేసుకున్నారు. లేటెస్ట్ గా.. కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని.. రాహుల్ గాంధీ ప్రకటనే ఫైనల్ అంటూ ఆకులు పట్టుకున్నారు. కోమటిరెడ్డి మాటలు పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చడంతో.. కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే మండిపడ్డారు. వెంకట్ రెడ్డిపై అధిష్టానానికి ఇచ్చేందుకు నివేదిక రెడీ చేస్తున్నారు.
అటు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కోమటిరెడ్డికి పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. కొంత మంది నాయకులు వారి విలాసవంతమైన, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏసీ గదుల్లో కూర్చొని ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు..అంటూ గట్టిగా హెచ్చరించారు.
కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తూ, పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరూ మాట్లాడొద్దని రేవంత్రెడ్డి అన్నారు. 9 ఏళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ తో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సొంతంగా గెలిచే అవకాశం ఉన్నప్పుడు పొత్తులపై చర్చ అనవసరమన్నారు.
దుర్మార్గాలు, అక్రమాలు చేసి అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలను జైళ్లకు పంపించారు.. కొన్ని గ్రామాల్లో హత్యలు చేశారు.. అలాంటి పార్టీతో కలవాలనే ఆలోచన రావడం కూడా నేరమే అవుతుందని ఘాటుగానే స్పందించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సర్వే ఏజెన్సీ కూడా స్పష్టంగా ఏమీ చెప్పలేదు.. అలా ఎవరైనా చెబితే అది కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అవుతుందంటూ పరోక్షంగా కోమటిరెడ్డి చేసిన సర్వేల ప్రస్తావనను విమర్శించారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ ఓట్ల శాతం 33 శాతానికి పడిపోయిందని.. ఇదే సమయంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ 28 నుంచి 30 శాతానికి పెరిగిందని.. బీజేపీ ప్రజాదరణ 7 నుంచి 11 శాతంగా ఉందని.. రేవంత్ చెప్పారు. ఇలా అస్పష్ట అంచనాలు ఉన్నాయే కానీ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో ఎవరికీ, ఏ సర్వేలకీ.. ఎలాంటి స్పష్టత లేదన్నారు.