NTR: కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ. జాతిపితకు దేశం ఇచ్చిన గౌరవం ఇది. పలు అరుదైన సందర్భాల్లో.. ప్రత్యేక వ్యక్తుల ఫోటోలతో నాణేలు, స్టాంపులు ముద్రించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఆ అద్భుత గౌరవం తెలుగుతేజం నందమూరి తారకరామారావుకు దక్కింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల వేళ.. కేంద్రం ప్రభుత్వం తెలుగువారికి తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర పరిధిలోని మింట్ ఈ నాణేన్ని తీసుకురానుంది.
ఆ వెండి నాణెం ఎలా ఉండాలి? ఎన్టీఆర్ కు చెందిన ఏ ఫోటో పెట్టాలి? తదితర అంశాలపై రామారావు కూతురు పురందేశ్వరితో మింట్ అధికారులు చర్చించారు. ఆమె నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రధానంగా మూడు ఫోటోలను పరిశీలించారు. వాటిలో ఒకటి ఫైనల్ చేయనున్నారు.
ఎన్టీఆర్ పేరిట నాణెన్ని ముద్రించాలని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను.. బీజేపీ నేత పురందీశ్వరి కోరారు. ఆమె రిక్వెస్ట్ మేరకు.. నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ ఫోటోతో వెండి నాణెం ముద్రించేలా మింట్ నుంచి ఆమోదం వచ్చేలా చూశారు.
వెండి నాణెం తయారీ ప్రొసీజర్కు నెలరోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతే ఎన్టీఆర్ సిల్వర్ కాయిన్ రిలీజ్ అవుతుందని అంటున్నారు.