BBC : భారత్ లోని బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజూ ఐటీ సర్వే కొనసాగుతోంది. గోద్రా అల్లర్ల వెనుక నరేంద్ర మోదీ ప్రమేయం ఉందంటూ వివాదాస్పద డాక్యుమెంటరీని ఇటీవల బీబీసీ ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సర్వే చేయడం వివాదాన్ని రేపింది. బీబీసీ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబైలోని కార్యాలయాల్లో ఐటీ సర్వే చేపట్టింది.
ఐటీ సర్వే నేపథ్యంలో బీబీసీ యాజమాన్యం తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐటీ అధికారులకు సహకరించాలని మెయిల్స్ పంపింది. అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానం చెప్పాలని సూచించింది. జీతం, వ్యక్తిగత ఆదాయంపై వివరాలు అడిగితే ఇవ్వాలని స్పష్టం చేసింది. బ్రాడ్కాస్ట్ విభాగ సిబ్బంది కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. మిగిలిన సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని నిర్దేశించింది. ఐటీ సర్వేపై సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు చేయవద్దని ఇప్పటికే సిబ్బందికి బీబీసీ ఆదేశాలు జారీ చేసింది. 2012 నుంచి ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. తాము చేపట్టినవి సోదాలు కాదు.. సర్వే అని ఐటీ విభాగం ఇప్పటికే ప్రకటించింది.
గుజరాత్ అల్లర్లలో మోదీ హస్తం ఉందని ఆరోపిస్తూ.. ‘ఇండియా : ద మోదీ క్వశ్చన్’ పేరుతో రెండు భాగాలుగా డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసింది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోదీకి క్లీన్చిట్ వచ్చిన తర్వాత.. ఇలాంటి కార్యక్రమాన్ని బీబీసీ ప్రసారం చేయడమేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మోదీ డాక్యుమెంటరీ లింకులను సోషల్ మీడియా వేదికల నుంచి కేంద్రం నిషేధించింది.
బీబీసీ కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సర్వేపై అమెరికా స్పందించింది. ఈ విషయంలో ఆచితూచి మాట్లాడింది. బీబీసీ కార్యాలయాల్లో సర్వే జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛాయుత మీడియాకు మద్దతు ఇస్తున్నామని చెప్పింది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యలను నిరంతరం ప్రస్తావిస్తామని పేర్కొంది. ఈ స్వేచ్ఛాయుత వాతావరణమే అమెరికాలోనూ, భారత్ లోనూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ప్రైస్ చెప్పారు.