ChatGPT :సైబర్ క్రిమినల్స్ ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. మార్కెట్లోకి ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందంటే చాలు.. దానిని హ్యాకింగ్ చేసే పనిలో పడుతున్నారు. కొందరు హైటెక్ హ్యాకర్ల ముందు ఎంత పెద్ద టెక్నికల్ సైబర్ సెక్యూరిటీ అయినా నిలబడలేకపోతోంది. అందుకే తాజాగా టెక్ ప్రపంచంలో అడుగుపెట్టిన చాట్ జీపీటీ కూడా హ్యాకర్ల నుండి తప్పించుకోలేకపోయింది.
కృత్రిమ మేధస్సుతో తయారు చేయబడిన చాట్ జీపీటీని ఉపయోగించి హ్యాకర్లు.. యూజర్ల సమాచారాన్ని దొంగలించే ప్రయత్నం చేస్తున్నారని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. చాట్ జీపీటీ ద్వారా హ్యాకర్లు టెలిగ్రామ్ బాట్స్ను తయారు చేస్తున్నారు. అది యూజర్ల సమాచారాన్ని క్రాష్ చేసి హ్యాకర్ల చేతికి ఇస్తుంది. ప్రస్తుతం చాట్ జీపీటీలో మాల్వేర్ను రాసే ఫీచర్ను నిపుణులు యాడ్ చేయలేదు. కానీ ఒక్కసారి హ్యాకర్లు చాట్ జీపీటీని హ్యాక్ చేసిన తర్వాత యూజర్లు అడిగిన ప్రతీసారి అది మాల్వేర్ను రాసి వారికి అందిస్తుంది.
చాట్ జీపీటీని పూర్తిగా తమ చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలా అని హ్యాకర్ల ప్రపంచంలో పెద్ద చర్చే నడుస్తున్నట్టుగా సైబర్ సెక్యూరిటీ గుర్తించింది. ఏఐను యాక్సెస్ చేయాలంటే ఎన్నో పరిమితులు ఉంటాయి. వాటన్నింటిని దాటడం ఎలా అన్నదానిపై హ్యాకర్ల ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. చెక్ పాయింట్ రీసెర్చ్ ద్వారా టెలిగ్రామ్ బాట్స్ ఒక్కటే హ్యాకర్ల చేతిలో ఉన్న అస్త్రమని తెలుస్తోంది. 2019 నుండే హ్యాకర్లు చాట్ జీపీటీని కోడింగ్ను మెరుగుపరచుకోవడానికి ఉపయోగిస్తున్నట్టుగా వారి విచారణలో తేలింది.
మాల్వేర్ను అసలు హ్యాకర్లు ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడంపై సైబర్ సెక్యూరిటీ దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐలో ఉన్న ఏపీఐ ఫీచర్ ద్వారా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే చాట్ జీపీటీలో ఉన్న పరిమితులను దాటి రష్యన్ హ్యాకర్స్.. హ్యాకింగ్కు ప్రయత్నించినట్టుగా వారు కనిపెట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హ్యకర్ల కన్ను చాట్ జీపీటీపై ఉందని, అందుకే టెక్ నిపుణులు అలర్ట్గా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సెల్ అంటోంది.