SEBI New Rules:భారత స్టాక్మార్కెట్లలో షేర్ల అమ్మకం, కొనుగోలుకు సంబంధించి… కొత్త మార్జిన్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది… సెబీ. ఇకపై డీమ్యాట్ ఖాతాలో డబ్బు ఉంటేనే, దానికి తగ్గట్లుగా షేర్లు కొనే వీలుంటుంది. అంతేకాదు.. షేర్లు అమ్మాలన్నా కూడా కొంత మార్జిన్ చెల్లించాలి కాబట్టి… ఆ మేరకు డీమ్యాట్ అకౌంట్లో డబ్బు ఉండితీరాలి. లేకపోతే షేర్లు అమ్మడం కూడా సాధ్యం కాదు. ఇక షేర్లు అమ్మిన వెంటనే… మళ్లీ కొత్తగా షేర్లు కొనడం కూడా ఇకపై కుదరదు. ఎందుకంటే… షేర్ల ట్రేడింగ్కు టీ+1 సెటిల్మెంట్ అమల్లో ఉండటంతో… షేర్లు అమ్మిన మర్నాడే… ఆ మొత్తం డీమ్యాట్ ఖాతాలో జమ అవుతుంది. డబ్బు అకౌంట్లో పడ్డాకే మళ్లీ షేర్లు కొనేందుకు వీలవుతుంది. ఈలోపు కొత్తగా షేర్లు కొనాలంటే… డీమ్యాచ్ అకౌంట్లో అదనంగా డబ్బు జమ చేయాల్సిందే.
కొత్త నిబంధనల వల్ల స్టాక్మార్కెట్లో ‘స్పెక్యులేషన్’ తగ్గుతుందని, షేర్ల ధరల్లో ఎక్కువ తేడా కనిపించదని, స్వింగ్ ట్రేడర్లకు అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మేలు జరుగుతుందని, బ్రోకింగ్ సంస్థల మోసాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, కొత్త రూల్స్… స్టాక్ మార్కెట్ వ్యవహారాలపై ఎక్స్ఛేంజీలకు పూర్తి పట్టు ఇస్తాయని… ఇకపై బ్రోకింగ్ సంస్థల పాత్ర తగ్గుతుందని చెబుతున్నారు.
అయితే… కొత్త నిబంధనల వల్ల చిన్న ఇన్వెస్టర్లకు నష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా ఇకపై తక్కువ డబ్బుతో షేర్ల కొనుగోలు, అమ్మకాలు జరపడం వీలుకాదని అంటున్నారు. మార్జిన్ కోసం ఇన్వెస్టర్లు ఎక్స్ఛేంజీ దగ్గర తనఖా పెట్టిన షేర్లను అమ్మాలంటే… ముందు వాటిని తనఖా నుంచి వెనక్కి తెచ్చుకోవాలని, ఆ తర్వాతే వాటిని అమ్మేందుకు వీలుకలుగుతుందని… దీనికి కనీసం ఒక రోజు సమయం పడుతుందని, ఈ లోపు షేరు ధర పడిపోతే చిన్న ఇన్వెస్టర్ నష్టపోతాడని చెబుతున్నారు. చిన్న, మధ్య స్థాయి బ్రోకింగ్ సంస్థల వద్ద ట్రేడింగ్ పరిమాణం తగ్గిపోయి, ఆ మేరకు వాటికి కూడా నష్టం జరుగుతుందని అంటున్నారు.