CM Jagan : వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. జిందాల్ స్టీల్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణ నమూనాను సీఎం పరిశీలించారు. జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ ఈ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తుంది. తొలి దశలో రూ. 3,300 కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరగడం ఇది నాలుగోసారి. 2007లో వైఎస్ఆర్, 2018లో చంద్రబాబు ఈ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్కు జగన్ శంకుస్థాపన చేశారు. తాజాగా ఇప్పుడు భూమిపూజ చేశారు.
ఫేజ్ -1..
స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం జేఎస్ డబ్ల్యూ లిమిటెడ్ కు ఎకరం రూ. 1.65 లక్షల చొప్పున 3,148 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో ఏటా 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తారు. తొలి దశలో 3, 300 కోట్ల ఖర్చు చేస్తారు. 36 నెలల వ్యవధిలో ఫేజ్-1 పనులు పూర్తి చేస్తారు. తొలి దశలో వైర్ రాడ్స్ , బార్ మిల్స్ ఉత్పత్తి చేస్తారు.
ఫేజ్-2..
స్టీల్ ప్లాంట్ ఫేజ్ -2 పనులు రూ. 5,500 కోట్లతో చేపడతారు. 2029 మార్చి 31 నాటికి రెండో దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ కు మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోంది. ఇందుకోసం రూ. 720 కోట్లు ఖర్చు చేస్తుంది. ఎన్ హెచ్ -67 పై ముద్దనూరు నుంచి జమ్మలమడుగు వరకు రోడ్డు అనుసంధానం కోసం రూ. 145 కోట్లు ఖర్చు చేస్తోంది. 4 లేన్ల రహదారిని 12 కిలోమీటర్లు నిర్మిస్తారు. ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరు వరకు రైల్వే లైన్ 9.4 కిలోమీటర్లు నిర్మిస్తారు. ఇందుకోసం 323 కోట్లు ఖర్చు చేస్తారు. మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేస్తారు. దీని కోసం 15 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మిస్తారు. రూ.76 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశారు.
స్వప్నం సాకారం..
స్టీల్ ప్లాంట్ నిర్మాణం అనేది ఎప్పటి నుంచే ఉన్న కల అని సీఎం జగన్ అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని దివంగత వైఎస్ఆర్ కలలు గన్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.