T20 World Cup : టీ20 వరల్డ్ కప్ తొలిమ్యాచ్ లో పాకిస్థాన్ పై అద్భుత విజయం సాధించిన భారత్ మహిళల జట్టు ..రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడుతుంది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. పాక్ పై గెలుపు, ఆ తర్వాత రోజు WPL వేలంలో భారీ ధరకు అమ్ముడుపోవడంతో టీమిండియా ఫ్లేయర్స్ మంచి జోష్ లో ఉన్నారు. ఇదే ఊపులో విండీస్ ఓడించి సెమీస్ రేసులో ముందుకెళ్లాలనుకుంటున్నారు.
బౌలింగ్ బలహీనతలు..
తొలి మ్యాచ్ భారత్ , పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో తొలి 10 ఓవర్లు భారత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ చివరి 10 ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చేశారు. తొలి మ్యాచ్ లో భారత్ బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. రాధికా యాదవ్ మినహా ఎవరూ సరిగా రాణించలేదు. పేసర్ రేణుకా సింగ్ పై భారీ ఆశలు పెట్టుకున్నా పాక్ పై విఫలమైంది.
బ్యాటర్లే బలం..
స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన గాయం కారణంగా తొలి మ్యాచ్ ఆడలేదు. విండీస్ తో జరిగే మ్యాచ్ లో భారత్ వైస్ కెప్టెన్ స్మృతి బరిలోకి దిగనుంది. పాక్ పై షఫాలీ వర్మ, జేమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ అద్భుతంగా రాణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫామ్ లోకి వస్తే భారత్ బ్యాటింగ్ బలం మరింత పెరుగుతుంది. మొత్తంమీద బ్యాటర్లే భారత్ గెలుపుగుర్రాలు.
భారత్ దే పై చేయి..
మరోవైపు విండీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై భారత్ కు మంచి రికార్డు. ఇరుజట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ ల్లోనూ భారత్ జట్టే విజయం సాధించింది. అందులో 4 మ్యాచ్ లు భారీ తేడాతో గెలిచింది. ఒక్క మ్యాచ్ మాత్రమే ఉత్కంఠగా సాగింది. ప్రస్తుతం భారత్ జోరు ముందు విండీస్ నిలవడం కష్టమే. కెప్టెన్ హేలీ మాథ్యూస్ పైనే విండీస్ ఆధారపడుతోంది. బౌలింగ్ బలంగా ఉన్నా.. బ్యాటింగ్ విండీస్ కు సమస్యగా మారింది. మొత్తంమీద ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ రేసులో మరింత ముందుకెళ్లాలన్న లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది.