RevanthReddy: 500లకే గ్యాస్ సిలిండర్.. రైతులకు 2 లక్షలు రుణమాఫీ.. పోడు భూములకు పట్టాలు.. ఇలా హామీల వర్షం కురిపిస్తూ జోరుగా ముందుకు సాగుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగుతున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వీహెచ్ తదితరులు హాజరయ్యారు.
తన ప్రసంగంలో కేసీఆర్ పై ఫైరయ్యారు రేవంత్ రెడ్డి. భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానని కేసీఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామచంద్రుడికే మాటిచ్చి తప్పిన వ్యక్తి.. సీఎంగా ఉండడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు.
బొడి గుండు మీద బొచ్చు మొలిచేది లేదు.. తెలంగాణలో బీజేపీ గెలిచేది లేదు.. అంటూ కమలనాథులపై పంచ్ లు వేశారు రేవంత్. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. అప్పులతో రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయని అన్నారు. పేదలకు ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తామని.. ప్రతి కార్యకర్త ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.
భద్రాచలం ఎప్పుడూ కాంగ్రెస్ కు కంచుకోట అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రేవంత్ పాదయాత్రలో పాల్గొన్న భట్టి.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వస్తాయని భట్టి చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మరోసారి మోసపోవద్దని హెచ్చరించారు. భద్రచలం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందన్న భట్టి.. ఆరోగ్య శ్రీ లాంటి గొప్ప పథకం తెచ్చి ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికీ చేర్చిందన్నారు. మరోసారి తెలంగాణ పోరాటం చేయవలసిన అవసరం అందరి మీదా ఉందన్నారు భట్ విక్రమార్క.