Nellore: అనుకున్నట్టే జరుగుతోంది. నెల్లూరులో గ్యాంగ్ వార్ మొదలైంది. రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, మిగతా వైసీపీ లీడర్లకు మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. కనబడితే కొట్లాటకు దిగే పరిస్థితి వచ్చింది. తాజాగా, నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా దగ్గర పెద్ద ఎత్తున ఘర్షణ జరగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు, మాజీ మంత్రి అనిల్ ఫాలోయర్స్.. పరస్పరం ఎదురుపడ్డారు. ఒకరిని చూడగానే ఇంకొకరు ఆవేశంతో రగిలిపోయారు. మాటా మాటా అనుకున్నారు. కొట్టుకున్నారు. తన్నుకున్నారు. కత్తితో దాడి చేసుకున్నారు.
గొడవలో ఎమ్మెల్యే అనిల్ అనుచరుడైన సమీర్ కు కత్తిపోట్లు దిగాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని అనిల్ కుమార్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.
భారీ ఘర్షణతో నెల్లూరు జిల్లాలో హైటెన్షన్ క్రియేట్ అయింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉన్నారు. సమీర్ కు కత్తిపోట్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నివురుగప్పిన నిప్పులా ఉంది.