Teachers: తెలంగాణ సర్కారుకు హైకోర్టులో షాక్ తగిలింది. టీచర్ల బదిలీలు మళ్లీ మొదటికి వచ్చాయి. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో అనేక విషయాలు హైకోర్టులో వీగిపోతున్నాయి. తాజాగా టీచర్ల బదిలీలపైనా ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది.
ఉపాధ్యాయుల బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయనేది ఆరోపణ. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్. వాదనలు విన్న ధర్మాసనం బదిలీలపై మార్చి 14 వరకు స్టే విధించింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలే టీచర్లు. ఏమాత్రం అసౌకర్యం కలిగినా ఊరుకోరు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బదిలీలు ఆగిపోవడంతో వారంతా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కా కసరత్తు లేకుండా ఎలా నిబంధనలు రూపొందించారని ప్రశ్నిస్తున్నారు. అయితే, కేసు వేసింది కూడా టీచర్లే కావడం.. వారి వారి అసోసియేషన్ల మధ్య ఆధిపత్య పోరే ఇందుకు కారణం అనే టాక్ కూడా వినిపిస్తోంది.