Adani: అదానీ కొంప కొల్లేరైంది. కంపెనీ షేర్లు పేక మేడలా కుప్పకూలిపోయాయి. మార్కెట్లలో బ్లడ్ బాత్ నడిచింది. సుమారు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మదుపర్లు ఆగమాగమయ్యారు. హిండెన్ బర్గ్ రిసెర్చ్ రిపోర్ట్.. అదానీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇంతకీ, హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలన్నీ నిజమేనా? అంటే కంపెనీ మాత్రం కాదంటోంది. కేంద్రం మౌనం వహిస్తోంది. ప్రధాని మోదీ నోరు మెదపడం లేదు. కమిటీ వేస్తామని మాత్రం తాజాగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా కొంతకాలంగా దేశ రాజకీయమంతా అదానీ చుట్టూ తిరుగుతుండగా.. నష్ట నివారణ చర్యలకు రెడీ అయింది కంపెనీ. గ్రూప్ కంపెనీల్లో స్వతంత్ర ఆడిట్ కోసం గ్రాంట్ థోర్టన్ (Grant Thornton) అనే అకౌంటెన్సీ సంస్థను నియమించుకుంది అదానీ. తద్వారా పెట్టుబడిదారులు, నియంత్రణా సంస్థలకు భరోసా ఇవ్వాలని భావిస్తోంది.
నిధుల దుర్వినియోగం, స్వదేశీ నిధుల దారి మళ్లింపు, రుణాలను ఇతర అవసరాలకు వినియోగించడం వంటి ఆరోపణలపై ఆడిట్ జరగనుంది. కంపెనీ ఖాతాలు బలంగా ఉన్నాయని, ప్రాజెక్టుల అమలు నిరాటంకంగా కొనసాగుతుందని ఆడిట్ ద్వారా నిరూపించుకోవాలని చూస్తోంది. అదానీ గ్రూప్ ఏ విషయాన్ని దాచిపెట్టలేదని.. RBI, SEBI తదితర నియంత్రణ సంస్థలకు చూపించడమే ఆడిట్ ప్రాథమిక లక్ష్యమని కంపెనీ వర్గాలు తెలిపాయి.
కంపెనీ టార్గెట్స్, మూలధన వ్యయాల్లో కోత విధించ వచ్చన్న వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది. ప్రాజెక్టులు ఆలస్యం కావొచ్చు కానీ.. వాయిదా పడడం కానీ, విరమించుకోవడం కానీ జరగదని స్పష్టం చేసింది. సౌర విద్యుత్తు, హరిత హైడ్రోజన్, విమానాశ్రయాల విస్తరణ ప్రణాళికలు అనుకున్న సమయానికే పూర్తి అవుతాయని ప్రకటించింది. తాజా ఆడిట్ తో మార్కెట్ వర్గాల్లో మరింత భరోసా కల్పించడమే అదానీ ధ్యేయంగా కనిపిస్తోంది.