Telangana: తెలంగాణలో హంగ్ వస్తుంది.. కాంగ్రెస్ ఐకమత్యంగా పోరాడితేగానీ 40 నుంచి 50 సీట్లు రావు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవాల్సిందే. ఇవీ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఈ కామెంట్లే ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ లో పెద్ద కల్లోలమే నడుస్తోంది. హస్తం నేతలంతా కోమటిరెడ్డిని ఫుల్ గా కార్నర్ చేస్తున్నారు. ఇదే ఛాన్స్ గా తెలంగాణలో సింగిల్ గా అధికారంలోకి వచ్చేది తామేనంటూ కమలనాథులు కదనోత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఇదంతా సరేగానీ. ఇంతకీ కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంత? అనే చర్చను మాత్రం ఎవరూ పట్టించుకోవట్లే. తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మూడు ప్రధాన పార్టీల్లో ఎవరికీ మెజార్టీ వచ్చే అవకాశం లేదా? ఈసారి ఎన్నికలు మూడు పార్టీలకు చుక్కలేనా? ఫలితం.. త్రిశంకు స్వర్గమేనా?
కోమటిరెడ్డి కామెంట్లు మరీ కొట్టిపడేసేవేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఆయన మాటలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరపతి బాగా తగ్గింది.. ప్రజా వ్యతిరేకత పెరిగింది.. అదే సమయంలో బీజేపీ భారీగా పుంజుకుంది.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సైతం కమాన్ అంటోంది. ఇలా మూడు పార్టీలు దాదాపు సరిసమాన స్థితిలోనే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎంత దూకుడుగా ఉన్నా.. సంస్థాగతంగా ఆ పార్టీకి ప్రజాబలం తక్కువేనని అంటారు. అందుకే, దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలంటూ కమలదళాన్ని తరచూ సవాల్ చేస్తుంటారు. ఎమ్మెల్యే అభ్యర్థులే లేరు.. ఇక ఓట్లేమి పడతాయి? అంటున్నారు. అర్భన్ ప్రాంతాల్లో, హిందూ-ముస్లిం ఉద్రిక్తతలు ఉన్న జిల్లాల్లో బీజేపీ చెప్పుకోదగ్గ ప్రభావం కచ్చితంగా చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన, బీజేపీకి 30-40 సీట్లు మాత్రమే రావొచ్చనేది ఓ వాదన.
కాంగ్రెస్ లో ఎన్ని కుమ్ములాటలు ఉన్నా.. ఆ పార్టీకి ఇప్పటికీ గ్రామస్థాయిలో బలమైన నెట్ వర్క్ ఉంది. చాలా ప్రాంతాల్లో అయితే బీఆర్ఎస్, లేదంటే కాంగ్రెస్. ఆ రెండు పార్టీల మధ్యనే వార్. బీజేపీ జెండా వెళ్లని ఊళ్లు వేలాదిగా ఉన్నాయనే మాటా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ సాగుతుందని.. చెరో 40-50 స్థానాలు గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు. అంటే, కోమటిరెడ్డి చెప్పినట్టే.. తెలంగాణలో హంగ్ వచ్చే పరిస్థితిని కాదనలేమని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసే అవకాశమే లేదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలుస్తాయా? అంటే రేవంత్ రెడ్డి ఉండగా అది జరగదు. మరి, ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకుంటే?.. ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుంటే?.. తెలంగాణలో ఏం జరగొచ్చు?.. ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టమే..అంటున్నారు.