KTR: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ఢిల్లీ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఏమి ఆశ్చర్యం. ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని రోజుల తర్వాత బీబీసీ ఇండియాపై ఐటీ దాడులా?.. ఐటీ, సీబీఐ, ఈడీ ఏజెన్సీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయి. తర్వాత ఏంటి? హిండెన్బర్గ్పై ఈడీ దాడులా? లేక టేకోవర్ ప్రయత్నమా?’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇక ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో దాదాపు 60 నుంచి 70 మంది ఐటీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బీబీసీ ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
కాగా, ఇటీవల ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2002 గుజరాత్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్లపై బీబీసీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే భారత ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించింది.
ఈ వ్యవహారంపై హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా అత్యున్నత న్యాయం స్థానం సుప్రీంకోర్టులో పిటీసన్ కూడా దాఖలు చేశారు. ఈ డాక్యుమెంటరీ నేపథ్యంలో బీబీసీని దేశంలో నిషేధించాలంటూ కోర్టునుకోరారు. అయితే సుప్రీం ఆ పిటీషన్ను తిరస్కరించింది. ఇదిలా ఉండగా బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.