Komatireddy : కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, బీఆర్ఎస్ తో కలవాల్సిందేనని సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణలో కాకరేపుతున్నాయి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. గతంలో రాహుల్ గాంధీ వరంగల్ సభలో ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఒంటరిగానే తెలంగాణలో పోటీ చేస్తుందని అప్పుడే క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి బీఆర్ఎస్ తో కలవాల్సిందేనని చెప్పడం కాంగ్రెస్ లో కలకలం రేపింది. ఎన్నికలకు 10 నెలల ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి రాదంటే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని ఇప్పటికే కొందరు నేతలు మండిపడుతున్నారు. ఆ వ్యాఖ్యలతో కార్యకర్తలు బాధపడతారని వీహెచ్ అన్నారు. తప్పులుంటే సరిదిద్దుకుని ముందుకెళ్లాలని కానీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదన్నారు. బీఆర్ఎస్, బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఒంటరిగానే పోటీ చేసి బీఆర్ఎస్ ను ఇంటికి పంపిస్తామన్నారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ కు నష్టం చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీకి క్రమంగా జనాదరణ పెరుగుతోంది. ములుగు జిల్లా సమ్మక్మ, సారలమ్మ ప్రాంగణం నుంచి పాదయాత్ర చేపట్టిన రేవంత్ .. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజు కార్నర్ మీటింగ్ లో ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెబుతున్నారు. రేవంత్ పాదయాత్రకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అంటున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారని పార్టీ నేతలు మండిపడుతున్నారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అటు బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తమ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారో బీజేపీలో ఉన్నారో తెలియడంలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సెటైర్లు వేశారు.
అటు బీజేపీ నేతలు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 90 సీట్లు వస్తాయని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో అంతగా ఉండదని చెబుతున్నారు. మొత్తంమీద కోమటిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని చాలామంది అంటున్నారు. మరి కోమటిరెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నారా? బీజేపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారా? బయటకు వెళుతూ కాంగ్రెస్ కు మరింత నష్టం చేకూర్చాలనుకుంటున్నారా? అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత కోమటిరెడ్డి తెలంగాణ రాజకీయాలపై జోస్యం చెప్పడం అనుమానాలకు దారితీస్తోంది. మరి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా? చేస్తే అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా? ..