Murder: మహిళలపై దాడులను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఎక్కడో ఓ దగ్గర దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేటుగాళ్లు విచక్షణ కోల్పోయి మహిళలపై దాడులు చేస్తున్నారు. అంధులను, వికలాంగులను కూడా వదిలిపెట్టడం లేదు. తాడేపల్లిలో ఓ కేటుగాడు అంధురాలైన బాలికపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. సీఎం ఇంటి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
ఎన్టీఆర్ కట్ట సమీపంలో నివసిస్తున్న యేసేబు, మనోహరమ్మ దంపతుల కూతురు ఎస్తేరు రాణి(17) పుట్టుకతోనే కంటిచూపు కోల్పోయింది. తల్లిదండ్రులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వారు కూలిపనులకు వెళ్లగా ఎస్తేరు ఒక్కతే ఇంటి దగ్గర ఉంది. ఈక్రమంలో సమీపంలో నివసించే కుక్కల రాజు అనే వ్యక్తి మద్యంమత్తులో వాళ్ల ఇంటికి చేరుకొని ఎస్తేరు రాణి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
సాయంత్రం తల్లిదండ్రులు వచ్చాక ఎస్తేరు జరిగిన విషయం చెప్పడంతో.. వారు రాజును నిలదీశారు. పెద్దల సమక్షంలో అతడిని శిక్షించారు. దీంతో కక్ష్య పెట్టుకున్న రాజు ఎస్తేరును హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు రాత్రి తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఇంట్లోకి చొరబడి ఎస్తేరుపై దాడి చేశాడు. తల, మెడపై కత్తితో దారుణంగా నరికి పారిపోయాడు. తల్లిదండ్రులు వచ్చే సరికి ఎస్తేరు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది.
దీంతో వాళ్లు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎస్తేరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజుపై ఇప్పటికే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. విపరీతంగా మద్యం సేవించి తరచూ జనాలతో గొడవపడుతుంటాడని స్థానికులు తెలిపారు.
ఇక సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిత్యం ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.