Pulwama Attack: 14.02.2019.. భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడిన రోజు. 40 మంది వీర సైనికులను కోల్పోయిన రోజు. పుల్వామా అటాక్ జరిగి నేటితో సరిగ్గా నాలుగేళ్లు. ఈ దాడిలో వీరమరణం పొందిన సైనికులను గుర్తుచేసుకుంటూ దేశం మొత్తం వారికి నివాళి అర్పిస్తోంది.
సరిగ్గా ఇదే రోజున జమ్మూకశ్మీర్లోని శ్రీగనర్ జాతీయ రహదారిపై పాక్ ఉగ్రమూకలు భారతీయ జవాన్లపై దాడి చేశారు. పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది సైనికులు వీరమరణం పొందారు. కాలిపోయిన మృతదేహాలు, ట్రక్కులు.. ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. ఈ అటాక్తో భారత్ మొత్తం ఆగ్రహంతో ఊగిపోయింది. జవాన్ల మరణానికి దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది. ఈ దాడిని ఖండిస్తూ దేశానికి చీకటి రోజంటూ ప్రతి ఒక్కరూ అమరవీరులకు నివాళి అర్పిస్తున్నారు.
అయితే ఈ దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్కు చెందిన జైషే అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. దీంతో పాక్పై భారత్ ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీని 200 శాతానికి పెంచింది. అలాగే ఈ దాడి జరిగిన ఐదు రోజుల తర్వాత భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. అలాగే భాతర వైమానికి దళం పాకిస్థాన్లోని బాలాకోట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిశిరంపై దాడి చేసింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.12 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.