Adani: అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకరించింది. అదానీ వివాదంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణలో కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇన్వెస్టర్ల సొమ్ము భద్రత కోసం కమిటీ వేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సెబీ పర్యవేక్షిస్తోందని.. సీజేఐ ధర్మాసనానికి వివరించారు. కమిటీలో సభ్యులను సూచించాలని.. ధర్మాసనాన్ని సొలిసిటర్ జనరల్ కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ లో ఉంచి తమకు సమర్పించాలని.. సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది.
అదానీ గ్రూప్.. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ కు పాల్పడిందంటూ.. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ఆరోపించింది. సుమారు 10 లక్షల కోట్ల మేర ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు తన రిపోర్ట్ పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇటు ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అదానీ వ్యవహారం.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదిపేశాయి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు స్తంభించిపోయాయి. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలంటూ.. ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ వ్యవహారంపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే మోడీ మాత్రం ఈ విషయంలో మౌనం వహించారు.
ఇటు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కింది. పెద్ద సంఖ్యలో ఉన్న ఇన్వెస్టర్లకు సంబంధించిన విషయం కావడంతో.. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీ వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. కేంద్రం, ఆర్బీఐ, సెబీలను ప్రతివాదులుగా చేర్చారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్.. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. విచారణ చేపట్టిన సుప్రీం.. కమిటీ ఏర్పాటుపై ఈ నెల 13 లోగా స్పందన తెలియజేయండంటూ.. కేంద్రానికి నోటీసులు పంపించింది. అంతేకాకుండా.. భవిష్యత్తులో ఇన్వెస్టర్ల సొమ్ముకు ఎలా రక్షణ కల్పిస్తారనేది తెలియజేయాలని.. పేర్కొంది. అయితే సుప్రీం నోటీసులపై స్పందించిన కేంద్రం.. కమిటీ వేసేందుకు సిద్ధమని ప్రకటించింది.
మరోవైపు గ్రూప్ షేర్ల విలువ భారీగా పడిపోవడంతో.. అదానీ టాప్ 20 బిలియనీర్ల జాబితాలో కూడా స్థానం కోల్పోయారు. సోమవారానికి అదానీ నికర విలువు.. 2.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ బిలియనీర్ జాబితాలో 22వ స్థానానికి పడిపోయారు.