Jagan: గడప గడపకూ మన ప్రభుత్వం.. ఏపీలో జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి డుమ్మాలు కొట్టిన ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత జగన్ క్లాస్ తీసుకున్నారు. ఇంటింటికీ వెళ్లకపోతే.. వచ్చే ఎన్నికల్లో మీరిక ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ తో చీవాట్లు తిన్న ఎమ్మెల్యేల్లో కొడాలి నాని, బుగ్గన, వసంత కృష్ణ ప్రసాద్, సామినేని ఉదయభాను తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఐ ప్యాక్ టీమ్ తో ఏయే ఎమ్మెల్యే ఎన్నిరోజులు, రోజుకు ఎన్నిగంటలు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారో ఫుల్ డీటైల్స్ తెప్పించుకున్నారు జగన్. ఆ రిపోర్ట్ ఆధారంగా రేసులో వెనకబడిన వారందరికీ చీవాట్లు పెట్టారని అంటున్నారు.
పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు 30 మంది వరకూ ఉన్నట్టు జగన్ అన్నారు. వారంతా వెంటనే తీరు మార్చుకోవాలని.. ఇంటింటికీ వెళ్లాలని జగన్ గట్టిగానే చెప్పారని అంటున్నారు. జూన్ 30 వరకు టైమ్ ఇస్తున్నానని.. ఆలోగా మెరుగు పడకపోతే చర్యలు ఉంటాయని.. వచ్చే ఎన్నికలకు టికెట్ ఇచ్చేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదని జగన్ క్లారిటీ ఇచ్చారు.
ఇక, గడప గడపకు మన ప్రభుత్వం.. ఇచ్చిన జోష్ తో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టైటిల్: ‘జగనన్నే మా భవిష్యత్తు’.
‘జగనన్నే మా భవిష్యత్తు’ విధివిధానాలపై వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు వివరించారు జగన్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల రూపంలో.. 5.65 లక్షలమందితో వైసీపీకి విస్తృత నెట్ వర్క్ ఉందని జగన్ చెప్పారు. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా.. సుమారు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు. మార్చి 18 నుంచి 26 వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.