Pawan: తాడేపల్లిలో యువతులపై వరుస ఘటనలు జరుగుతుండటంపై జనసేనాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేపులు, మర్డర్లు జరుగుతున్నా.. జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందన్నారు.
తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో అంధురాలైన యువతి దారుణ హత్యపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని విమర్శించారు. సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని నిలదీశారు. తాడేపల్లిలోనే గతంలో జరిగిన రేప్ కేసులో ఒక నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని ఫైర్ అయ్యారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.
తన నివాసం పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా?.. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే.. అంటూ మండిపడ్డారు. తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది అంటూ తప్పుబట్టారు. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోందని.. యువతిని కిరాతకంగా చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలన్నారు జనసేనాని.