Hyderabad: హైదరాబాద్ లో ఈ కార్ రేస్ దుమ్ము రేపకుండానే గ్రాండ్ సక్సెస్ అయింది. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినా.. ఈవెంట్ మాత్రం అంతకుమించే అన్నట్టు జరిగింది. దేశంలో ఎన్నో నగరాలు ఉండగా.. మన హైదరాబాద్ లోనే ఈ-కార్లు పరుగులు పెట్టడం తెలంగాణ ఇమేజ్ ని మరింత పెంచింది. రాజకీయంగానూ బీఆర్ఎస్ సర్కారుకు దేశంలో మంచి ఇమేజ్ తెచ్చిపెట్టినట్టైంది.
ఈ-కార్ రేస్ చూసేందుకు హేమాహేమీలే తరలివచ్చారు. ముందురోజు హీరో మహేశ్ బాబు భార్య నమ్రతా పేరు మాత్రమే వినిపించింది. ఇక, మెయిన్ ఈవెంట్ రోజున బడాబడా ప్రముఖులు అటెండ్ అయ్యారు. కార్ రేసులంటే బాగా ఇష్టపడే క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్ అటెండెన్స్ వేసుకున్నారు. టీమిండియా ప్లేయర్స్ శిఖర్ ధావన్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్ కనిపించారు.
సినిమా ప్రముఖులకైతే కొదవే లేదు. రామ్ చరణ్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సిద్ధు జొన్నలగడ్డ, కేజీఎఫ్ హీరో యశ్, దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్ లతో పాటు నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ వైఫ్ ప్రణతిలు సందడి చేశారు.
మహీంద్ర రేసింగ్ కార్ల పర్ఫార్మెన్స్ చూసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర విచ్చేశారు. రామ్ చరణ్ తో కలిసి ‘నాటు నాటు’ సాంగ్ కు స్టెప్పులు కూడా వేశారు. మహీంద్రా రేసింగ్ కార్లను రామ్ చరణ్, సచిన్ తెందుల్కర్ లు ఆసక్తిగా పరిశీలించారు. ట్రాక్ పై స్వయంగా స్పోర్ట్స్ కారు నడిపి రేసింగ్ స్పీడ్ ను ఎంజాయ్ చేశారు.
ఇలా, హుస్సేన్ సాగర్ తీరంలో జరిగిన ఈ-రేస్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచానికి పరిచయం చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. అధికారిక ఈవెంట్ కావడంతో.. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకుర్, మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం హాజరుకావాల్సి వచ్చింది. ఇక, ఈ కార్ రేసును గ్రాండ్ సక్సెస్ చేసిన క్రెడిట్ కంప్లీట్ గా కేటీఆర్ ఖాతాలోనే పడుతోంది. ఈ-కార్లతో.. తమ పార్టీ కారు గుర్తునూ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారమూ జరుగుతోంది.