Telangana: బంగారు తెలంగాణ. కేసీఆర్ సీఎం అయ్యాక అప్పుల తెలంగాణ. ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ బర్బాద్ చేసింది… ఇవీ పదే పదే ప్రతిపక్షాలు చేసే విమర్శలు. అప్పులు తామే చేస్తున్నామా? కేంద్రం చేయట్లేదా? మోదీ సర్కారు రికార్డు స్థాయిలో అప్పులు చేసింది.. జీడీపీలో 50శాతానికి పైగా కేంద్రానికి అప్పు ఉంది అంటూ సీఎం కేసీఆర్ రెగ్యులర్ గా ఇచ్చే కౌంటర్. అప్పులు ఎందుకు చేస్తాం.. అభివృద్ధి కోసమేగా అనేది కేసీఆర్ ఆన్సర్. ఎవరి వాదన ఎలా ఉన్నా.. తెలంగాణకు ఉన్న అప్పులెన్నో.. పూర్తి డిటైల్స్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులోని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకీ తెలంగాణ అప్పులు ఎన్ని కోట్లో తెలుసా..?
2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ. 4,33,817.6 కోట్లు అని కేంద్రం వెల్లడించింది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.75,577 కోట్ల అప్పులు ఉండేవని తెలిపింది. ఆ అప్పులు కాస్తా 2021-22 నాటికి 2 లక్షల 83 వేల కోట్లకు చేరాయని స్పష్టం చేసింది. ఇవి కాక.. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరో లక్షా 50 వేల కోట్ల రుణాలు తీసుకున్నాయని లోక్ సభలో వెల్లడించింది కేంద్రం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఏటేలా చేసిన అప్పులు ఇలా ఉన్నాయి..
2014-15: రూ.8,121 కోట్లు
2015-16: రూ.15,515 కోట్లు
2016-17: రూ.30,319 కోట్లు
2017-18: రూ.22,658 కోట్లు
2018-19: రూ.23,091 కోట్లు
2019-20: రూ.30,577 కోట్లు
2020-21: రూ.38,161 కోట్లు
2021-22: రూ.39,433 కోట్లు