Google: టెక్ దిగ్గజం గూగుల్కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. మహారాష్ట్ర పుణేలోని గూగుల్ ఆఫీస్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం రాత్రి ఫోన్ చేసి సిబ్బందిని బెదిరించాడు. దీంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వ్కాడ్తో ఆఫీస్కు చేరుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో.. బాంబు లేదని తేల్చారు. గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ కాల్ చేశారని నిర్దారణకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ తర్వాత పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఫేక్ కాల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పుణే పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందివ్వడంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.