KishanReddy : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై గులాబీ బాస్ చేసిన విమర్శలను బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని కేసీఆర్ వాడుకున్నారని మండిపడ్డారు.
హామీల సంగతేంటి..?
గత బడ్జెట్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్ రాష్ట్ర పరిస్థితిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అని నిలదీశారు. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడ లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందన్నారు. దళితులకు మూడెకరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కుటుంబ పాలనపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని కిషన్ రెడ్డి నిలదీశారు.
మోదీపై విషం చిమ్ముతారా..?
అసెంబ్లీలో కేసీఆర్ పరిధి దాటి మోదీపై ఆరోపణలు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలా? మోదీ విద్వేష సమావేశాలా? అని అన్నారు. ఆధారాలు లేకుండా కేంద్రంపై ఆరోపణలు చేశారని విమర్శించారు. దేశ పరిస్థితులపై కేసీఆర్కు అవగాహన లేదని కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ కు సవాల్..
దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. చర్చ కోసం ప్రగతి భవన్ రావాలో, ఫామ్హౌజ్కు రావాలో చెప్పాలన్నారు. కేసీఆర్ ఎక్కడకు రమ్మన్నా వస్తామని స్పష్టం చేశారు. కేంద్రంపై తను చెప్పిన విషయాలు అబద్ధమైతే రాజీనామా చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఒకవేళ రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తే రండి అని సూచించారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజీనామా చేయ్సాలిందేనని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.