Earthquake : టర్కీ, సిరియా దేశాలను వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి. ఆ దేశాలలోని భూకంప ప్రభావిత ప్రాంతాలు శవాలు దిబ్బలుగా మారాయి. ఇప్పటికీ అక్కడ పదే పదే ప్రకంపనలు వస్తున్నాయి. తాజా టర్కీలో మరోసారి 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. గతంలో మనదేశం కూడా పెను భూకంపాలను చవిచూసింది. 2 దశాబ్దాల క్రితం గుజరాత్ లో వచ్చిన భూకంపం పెను విషాదాన్ని నింపింది. మరి భారత్ కు ఇంకా భూకంపాల ముప్పు ఉందా? ఉంటే ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది? ఏ ఏ రాష్ట్రాల్లో సేఫ్ జోన్ లో ఉన్నాయి. తెలుసుకుందాం..
భారత్లోనూ భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు వచ్చాయి. తాజాగా సిక్కింలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. సిక్కింలోని యుక్సోం ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని జాతీయ భూ విజ్ఞాన కేంద్రం ట్విట్ చేసింది. తెల్లవారుజామున 4:15 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు ప్రకటించింది. ఆదివారం అస్సాంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. అంతుకుముందు రోజు గుజరాత్ సూరత్లోనూ 3.8 తీవ్రతతో భూమి కంపించింది. భారత్ లోని 60 శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉందని కేంద్రం 2022 డిసెంబర్లో పార్లమెంట్ లో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు ఉన్న ప్రాంతాలను 4 జోన్లుగా విభజించారు.
వెరీ హై రిస్క్ జోన్..
భారత్ లోని 11 శాతం భూభాగం వెరీ హై రిస్క్ జోన్ లో ఉంది. ఇక్కడ భూకంపాలు సంభవించినప్పుడు తీవ్రత గరిష్టంగా రిక్టర్ స్కేల్పై 9 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు వెరీ హై రిస్క్ జోన్ లో ఉన్నాయి.
హైరిస్క్ జోన్..
భారత్ లోని 18 శాతం భూభాగం హైరిస్క్ జోన్ లో ఉంది. ఇక్కడ భూకంప తీవ్రత గరిష్టంగా రిక్టర్ స్కేలుపై
8 వరకు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్లో మిగిలిన ప్రాంతం పంజాబ్, హర్యానాలో కొన్ని ప్రాంతాలు, ఢిల్లీ, సిక్కిం, యూపీ ఉత్తర ప్రాంతం, బిహార్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని ప్రదేశాలు, పశ్చిమ రాజస్థాన్ హై రిస్క్ జోన్ లో ఉన్నాయి.
ముప్పు మధ్యస్తం..
భారత్ దేశంలోని 31 శాతం భూభాగంలో భూకంప ముప్పు మధ్యస్తంగా ఉంటుంది. ఈ జోన్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై గరిష్టంగా 7 వరకు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో భూకంప ముప్పు మధ్యస్తంగా ఉంటుంది.
లో రిస్క్ జోన్..
భారత్ భూభాగంలో 40 శాతం లో రిస్క్ జోన్ లో ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై గరిష్టంగా 6 కంటే తక్కువగానే నమోదవుతుంది. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. మొత్తంగా పరిశీలిస్తే దేశంలో 29 శాతం భూభాగంలో భూకంపాల ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నమాట. మొత్తంమీద దేశంలో 60 శాతం భూభాగంపై భూకంపాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. టర్కీ, సిరియాల్లో భూకంపాల తర్వాత భారత్ లోనూ తరచూ ప్రకంపనలు రావడం ఆందోళన కలిగిస్తోంది.