Delhi-Mumbai Expressway : దేశంలోనే అతి పెద్ద ఎక్స్ ప్రెస్ వే తొలిదశ ప్రారంభమైంది. ఢిల్లీ-ముంబై మధ్య ఈ ఎక్స్ ప్రెస్ వేను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. అందులో తొలిదశలో ఢిల్లీ-దౌసా- లాల్ సోట్ ల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి పనులు పూర్తికావడంతో ఈ మార్గాన్ని రాజస్థాన్ లో దౌసాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్వే దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలుస్తుందని మోదీ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ఢిల్లీతోపాటు మధ్యలో హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రను కలుపుతూ 1,386 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. జైపూర్, అజ్మేర్, కోటా, ఉదయ్పూర్, చిత్తోర్గఢ్, భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, అహ్మదాబాద్, సూరత్, వడోదరా లాంటి ప్రధాన పట్టణాలను ఈ రహదారి కలుపుతుంది.
ఈ రహదారి పూర్తైయితే ఢిల్లీ, ముంబై మధ్య ప్రస్తుతం ఉన్న దూరం 180 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణ సమయ 12 గంటలు తగ్గుతుంది. ఈ రహదారి నిర్మాణం కోసం 5రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని సమీకరించారు. సుమారు రూ.లక్ష కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ఏడాది చివరినాటికి ఈ ఎక్స్ప్రెస్వే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.
ప్రధాని మోదీ మరో 4 రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.18,100 కోట్లతో ఈ రోడ్లు నిర్మిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. తొలిదశలో మొత్తం 247 కిలోమీటర్ల రహదారిని 8 లేన్లుగా నిర్మిస్తారు. ఇందుకోసం రూ.10,400 కోట్లు నిధులు కేటాయించారు. ఈ రహదారి పూర్తైయితే మూడున్నర గంట్లలోనే ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణానికి 5 గంటల సమయం పడుతోంది.