KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరిరోజు కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ప్రసంగం కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ అహంకారం ఎన్నో రోజులు ఉండదని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ శాశ్వతం కాదన్నారు. 2024 తర్వాత బీజేపీ కుప్పకూలడం ఖాయమని స్పష్టం చేశారు. మన్మోహన్సింగ్ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం వెనుకబడి ఉందని కాగ్ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. తాను చెప్పే మాటలు అవాస్తవమైతే రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ చేశారు.
ఇదేం తీరు..
గోద్రా అల్లర్లపై బీబీసీ డ్యాకుమెంటరీ తీస్తే దాన్ని బ్యాన్ చేశారని కేసీఆర్ మండిపడ్డారు. అశ్వనీ ఉపాధ్యాయ అనే న్యాయవాది బీబీసీని బ్యాన్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ప్రపంచం ఏమనుకుంటుందని ప్రశ్నించారు. ఇంత అసహన వైఖరి అవసరమా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి ఇదేనా? అని నిలదీశారు. ఎవరైనా కేంద్రంపై విమర్శలు చేస్తే జైలు పెడతామని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు.
అహంకారం తగదు..
బంగ్లాదేశ్ వార్ గెలిచినప్పుడు ‘దుర్గామాత ఆఫ్ హిందుస్థాన్’ అని ఇందిరాగాంధీని వాజ్ పేయి పొగిడారని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ లాంటి వారినే దేశం ఓడించిందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదని సంయమనం అవసరమన్నారు. దేశంలో పలు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడంపై కేసీఆర్ మండిపడ్డారు. ఎల్ఐసీని కూడా అమ్మేయాలా? అని కేంద్రాన్ని నిలదీశారు. సోషలైజేషన్ ఆఫ్ లాసెస్.. ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ అనే నీతిని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనే మెరుగు..
కాంగ్రెస్ పాలనలో వార్షిక వృద్ధిరేటు 6.8 శాతం ఉందని కేసీఆర్ తెలిపారు. బీజేపీ హయాంలో 5.5 శాతానికి పతనమైందన్నారు. మన్మోహన్ హయాంలో తలసరి ఆదాయం వృద్ధిరేటు 12.73 శాతం ఉంటే.. మోదీ హయాంలో 7.01 శాతానికి పడిపోయిందన్నారు. ఇవన్నీ కాగ్ చెప్పిన గణాంకాలేనని తెలిపారు. జీడీపీలో అప్పుల శాతం 66.7 శాతం నుంచి మన్మోహన్సింగ్ పాలన ముగిసే సమయానికి 52 శాతానికి తగ్గిందన్నారు. మోదీ హయాంలో 52 శాతం నుంచి 56 శాతానికి పెరిగిందన్నారు. అప్పులు చేయడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరని కేసీఆర్ విమర్శించారు. మన్మోహన్సింగ్ హయాంలో ఎగుమతుల వృద్ధి రేటు 19.5 శాతం ఉంటే.. మోదీ హయాంలో 4.9 శాతానికి పడిపోయిందన్నారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని, విశ్వగురు నినాదం ఏమైందని ప్రశ్నించారు. ఇవన్నీ కఠిన వాస్తవాలని ఇందులో ఒక్కటి అబద్ధమైనా తాను రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ చేశారు.