Meta : ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. బడా కంపెనీలు కొందరు ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. ఈ సంస్థ గతేడాది నవంబర్ లో 11 వేల మంది ఉద్యోగులను సాగనంపింది. తాజాగా మరికొంత మంది ఉద్యోగులను తొలగించే యోచన చేస్తోంది. ఈ విషయాన్ని కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ ప్రచురించాయి. అయితే ఉద్యోగుల తొలగింపుపై ఇంతవరకూ మెటా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మెటాపై ప్రముఖ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కీలక విషయాలను వెల్లడించింది. బడ్జెట్ కేటాయింపులు, కొనసాగబోయే ఉద్యోగుల సంఖ్య విషయంలో కంపెనీలో అస్పష్టత నెలకొందని ఇద్దరు ఉద్యోగులు తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇంకోవైపు 2023లో కంపెనీ సామర్థ్యాన్ని పెంచాలని ఇటీవల సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. మిడిల్ మేనేజర్లు, డైరెక్టర్లు పనిలో భాగస్వాములు కావాల్సిందేనని స్పష్టంచేశారు. లేదంటే కంపెనీని వీడాలని హెచ్చరించారు. కంపెనీలో మేనేజర్లను పర్యవేక్షించడానికి కూడా మేనేజర్లు ఉన్నారని తెలిపారు. ఈ ప్రకటనతో జుకర్ బర్గ్ పరోక్షంగా ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి సంకేతాలిచ్చారు. అలాగే ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వని ప్రాజెక్టులను మూసివేస్తామని మెటా సంస్థ ఇటీవల ప్రకటించింది.
మరోవైపు టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ఇటీవల టిక్టాక్ ఇండియా భారత్లోని తమ ఉద్యోగులందర్నీ తొలగించింది. యాహూ 1,600 మందిని, డెల్ 6,500 మందిని తొలగించింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు 50వేల మందిని ఇంటికి పంపాయి. చాలా టెక్ కంపెనీలు బెంచ్ టీమ్ లను తొలగిస్తున్నాయి. దిగ్గజ సంస్థలు సైతం ట్రైనీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. మరికొంతకాలంపాటు ఇదే పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.