Banda Prakash : తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నిక లాంఛనంగానే జరిగింది. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
మండలి కొత్త డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను మండలిలో ఛైర్లో కూర్చోబెట్టారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కేసీఆర్ ప్రశంసించారు. ఇప్పుడు కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. ఆయన సేవలు తెలంగాణ ప్రజలకు ఎంతో అవసరమని చెప్పారు. మండలి డిప్యూటీ ఛైర్మన్గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నానని కేసీఆర్ అన్నారు.
బండ ప్రకాశ్కు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం సభకు ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ అన్నారు. బండ ప్రకాశ్ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1981లో మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. 2017 నుంచి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం దక్కించుకున్నారు.