Adani : అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో గ్రూపు కంపెనీల విలువ భారీగా పతనం కావడానికి కారణమైన హిండెన్బర్గ్తో న్యాయ పోరాటానికి గౌతమ్ అదానీ గట్టిగానే సిద్ధమవుతున్నారు. అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్ సంస్థ అయిన వాచ్టెల్ను నియమించుకుని… హిండెన్బర్గ్ను ముప్పుతిప్పలు పెట్టేందుకు స్కెచ్చేశారు. కార్పొరేట్ సంస్థల్లో తలెత్తే సంక్షోభాలను పరిష్కరించడంలో వాచ్టెల్ సంస్థకు విశేష నైపుణ్యం ఉండటంతో… హిండెన్బర్గ్తో న్యాయ పోరాటంలో పైచేయి సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు… అదానీ. అలాగే గ్రూపు కంపెనీలపై మళ్లీ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించగలననే ధీమాతో ఉన్నారు.
అదానీ గ్రూప్కు అండగా ఉండే సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ సంస్థ కార్యాలయంలో… హిండెన్బర్గ్తో న్యాయ పోరాటంపై వాచ్టెల్-అదానీ మధ్య డీల్ కుదురినట్లు సమాచారం. సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్ సంస్థ అధినేత సిరిల్ ష్రాఫ్ ఎవరో కాదు… స్వయంగా అదానీకి వియ్యంకుడు. తన కూతుర్ని అదానీ కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించారు. హిండెన్బర్గ్తో జరిగే న్యాయ పోరాటంలో… న్యూయార్క్కు చెందిన ‘వాచ్టెల్, లిప్టెన్, రోసెన్ అండ్ కట్జ్’ సంస్థ సీనియర్ లాయర్ల సేవలను వినియోగించుకోనున్నారు… అదానీ.
దశాబ్దాల చరిత్ర ఉన్న వాచ్టెల్ సంస్థకు అమెరికా కార్పొరేట్ చట్టాలపై పూర్తి అవగాహనతో పాటు, భారీ లావాదేవీల నిర్వహణలో మంచి పట్టు ఉంది. ఆర్థిక పరమైన వివాదాల్లో చిక్కుకున్న ఎన్నో సంస్థల తరఫున గతంలో పోరాడింది…. వాచ్టెల్. ఈ సంస్థ సక్సెస్ రేటు కూడా ఎక్కువే కావడంతో… ఇప్పటికీ చాలా కంపెనీలు న్యాయ పోరాటం కోసం ఆశ్రయిస్తుంటాయి. హిండెన్బర్గ్తో అదానీ చేస్తున్న న్యాయపోరాటంలో… ఆయన్ని వాచ్టెల్ ఎలా గెలిపిస్తుందో చూడాలి.
మరోవైపు… అదానీ-హిండెన్బర్గ్ వివాదంపై జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు… మదుపరుల పెట్టుబడుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. హిండెన్బర్గ్ నివేదిక వివాదంపై సెబీ, కేంద్రం అభిప్రాయం కోరిన ధర్మాసనం… అదానీ గ్రూప్పై వస్తున్న ఆరోపణలను పరిశీలించాలని, జడ్జితో కూడిన నిపుణులైన ప్యానల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.