Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో కీలక వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఢిల్లీలో ఈడీ అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్లో రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో రాఘవరెడ్డిని హాజరుపర్చనున్నారు.
ఇక ఈ కేసుకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్లో అదుపులోకి తీసుకోగా… పంజాబ్కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ మల్హోత్రాను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం రోజున సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ ఎదుట గోరంట్ల బుచ్చిబాబును హాజరుపర్చారు. కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. అయితే కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే గౌతమ్ మల్హోత్రాను కూడా అదే రోజు కోర్టులో హాజరుపర్చి కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా.. ఏడు రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మాగుంట రాఘవను కూడా కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.