ప్రస్తుత రోజుల్లో ఆడ, మగ అనే విబేధాలు చాలావరకు తగ్గిపోతున్నాయి. ఈ రంగంలో ఆడవారికి అనుమతి లేదు, ఈ రంగం కేవలం మగవారు పనిచేయడానికి మాత్రమే.. అనే మాటలు చాలావరకు ఈరోజుల్లో వినపడడం లేదు. మగవారు చేయలేని పనులు కూడా ఆడవారు చేయగలుగుతున్నారని ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో కూడా ఇద్దరు లేడీ సైంటిస్టులు తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈజిప్ట్కు చెందిన మెనటెల్లా ఎల్సిరఫీ, ఫిలిప్పిన్స్కు చెందిన ఫ్రెస్థెల్ క్లిమకోసా.. సైంటిఫిక్ ఫీల్డ్లోనే ఒక పెద్ద బ్రేక్కు ప్రయత్నిస్తున్నారు. మెనటెల్లా ప్రస్తుతం ఈజిప్ట్లోని జువైల్ సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని సెంటర్ ఫర్ జినోమిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది.
ఇక క్లిమకోసా.. ఫిలిప్సిన్స్ యూనివర్సిటీలో మెడికల్ మైక్రోబయోలజీ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ సైన్స్లో అసాధ్యమైన ప్రయోగాలను సాధ్యం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రస్తుతం మెనెటెల్లా.. డీఎన్ఏ రిపేర్ మెకానిజంను డెవలప్ చేసే పరిశోధనల్లో బిజీగా ఉంది. డీఎన్ఏపై ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. అయితే ఈ డీఎన్ఏ డ్యామేజ్ అయితే మాత్రం దాంతో పరీక్షలు నిర్వహించడం అసాధ్యంగా మారుతుంది. అందుకే డీఎన్ఏకు జరిగిన డ్యామేజ్ను దృష్టిలో పెట్టుకొని దానిని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చి..
దానిపై పరీక్షలు చేసేలా మెనెటెల్లా పరిశోధనలు నిర్వహిస్తోంది.
ఇక క్లిమకోసా విషయానికొస్తే.. మందులు లేని వ్యాధులకు కూడా తను మందులు కనుక్కునే ప్రయత్నంలో ఉంది. టీబీలాంటి వ్యాధులు మనుషులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కానీ వాటికి మాత్రం ఇప్పటివరకు సరైన చికిత్స లేదు. అందుకే ముందుగా టీబీకి చికిత్సను అందించడమే లక్ష్యంగా తను పరిశోధనలు చేస్తోంది.
ఇప్పుడు ఈ ఇద్దరు మెడికల్ పరిశోధకులు.. సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్లేషకులనే తమవైపు తిప్పుకునేలా చేశారు. ఇలాంటి వారు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టాలనుకునే ఎంతోమంది ఆదర్శమని నిపుణులు ప్రశంసిస్తున్నారు.