ఇతర ప్రపంచ దేశాలతో పోటీపడి మరి పరిశోధనలు చేయడానికి చైనా ఉత్సాహం చూపిస్తోంది. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి అయినా ఆ దేశం వెనకాడడం లేదు. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో లేని టెక్నికల్ పరికరాలు చైనాలో ఉన్నాయి. తాజాగా చైనా రాకెట్ టెక్నాలజీని ఉపయోగించి హెల్త్ సెక్టార్కు ఉపయోగపడే ఒక కొత్త పరికరాన్ని తయారు చేసింది.
పలు వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లకు కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో వారికి ఆక్సిజన్ సపోర్ట్ను అందిస్తారు. దానికోసమే ఆక్సిజన్ సిలండర్లు కూడా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక పరికరాన్నే చైనా హైబ్రిడ్ విధానంతో తయారు చేసింది. దాని పేరు ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజెనరేషన్ (ఎక్మో). రాకెట్ టెక్నాలజీ సహాయంతో ఈ పరికరాన్ని తయారు చేశారు శాస్త్రవేత్తలు. తాజాగా బీజింగ్లో లాంచ్ అయిన ఈ పరికరం కోవిడ్ 19 పేషెంట్ల జీవితాలను నిలబెడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఎక్మో అనేది కృత్రిమ గుండె, ఊపరితిత్తుల లాంటిది. ఇది బయట నుండే పేషెంట్కు ఊపిరి తీసుకునే విషయంలో, గుండె ఆరోగ్యంగా కొట్టుకునే విషయంలో సహాయపడుతుంది. మామూలుగా దీనిని ఓపెన్ హార్ట్ సర్జరీ సమయాల్లో ఉపయోగిస్తుంటారు. కోవిడ్ మహహ్మరి సమయంలో దీని వినియోగం ఆకాశాన్ని తాకింది. ఎక్మో ద్వారా ఎంతోమంది కోవిడ్ 19 పేషెంట్లు ఆరోగ్యంగా బతికి బయటపడడం అనేది సెన్సేషన్ సృష్టించింది.
2020 తర్వాత ఎక్మోను రీవైవ్ 1 పేరుతో రాకెట్ టెక్నాలజీ సాయంతో డెవలప్ చేయడం మొదలుపెట్టారు. రాకెట్లోని సెర్వోమెకానిజంతో ఈ ఎక్మో సిస్టమ్ డెవలప్మెంట్ జరిగిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఒక రాకెట్ పొజిషన్, డైరెక్షన్ మార్చడానికి ఈ సెర్వో మెకానిజం ఉపయోగపడుతుందని వారు అన్నారు. అందుకే ఎక్మో కూడా రాకెట్ సెర్వో మెకానిజంకు తగినట్టుగా పనిచేస్తుందని వారు తెలిపారు. ఇతర ఆక్సిజన్ పరికరాలతో పోలిస్తే.. ఎక్మో బరువు తక్కువగా ఉంటుందని, ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
బీజింగ్, టయాన్జిన్లోని ఎన్నో ఆసుపత్రులు, వైద్యులు ఎక్మో తయారీలో పాల్గొని.. తగిన సహాయాన్ని అందించారు. ఎన్నో సీరియస్ కేసులపై ఎక్మోను పరీక్షించిన తర్వాతే దీనిని లాంచ్ చేశామని వైద్యులు చెప్తున్నారు. ఎన్నో ఫారిన్ ప్రొడక్ట్స్తో పోలిస్తే.. ఎక్మో ధర కూడా చాలా తక్కువని వారు అంటున్నారు.