పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైనదే మైలాపూర్ ప్రాంతంలో ఉన్న కపాలీశ్వర్ దేవాలయం. చెన్నైలోని ఈ మైలాపూర్ లోని కపాలీశ్వర్ దేవాలయం పురాణ ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పార్వతీ దేవి, బ్రహ్మ, సుబ్రహ్మణ్యస్వామితో పాటు నాలుగు వేదాలతో ముడిపడిన ఎన్నో కథనాలు ఉన్నాయి. ఒక రోజు పరమశివుడు పార్వతీ దేవికి న మ: శి వా య అనే పంచాక్షరీ మంత్రంతో పాటు విభూతి ధారణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో పార్వతి దేవి లిప్త కాలం తన దగ్గరగా వచ్చిన నెమలి పట్ల ఆకర్షితురాలవుతుంది. దీంతో పరమశివుడు కోపగించుకొని పార్వతీ దేవిని నెమలిగా మారిపోవాలని శాపం పెడతాడు. అటు పై కోపం తగ్గిన తర్వాత పార్వతీ దేవికి శాప విమోచన రహస్యం కూడా చెబుతాడు.
పార్వతీ దేవి ప్రస్తుతం మైలాపురం ఉన్న చోట నెమలి రూపంలోనే వెయ్యేళ్లు తపస్సు చేస్తుంది. పార్వతి దేవి నెమలి రూపంలో తపస్సు చేసిన ప్రాంతము కాబట్టే దీనికి మైలాపూర్ అని పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ప్రాంతానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. తమిళంలో మైలు అంటే నెమలి అని అర్థం. అదే విధంగా ఒకసారి శుక్రాచార్యుడు తాను పోగొట్టుకున్న ఒక కన్నును తిరిగి పొందడానికి ఇక్కడే శివుడి గురించి తప్పస్సు చేశాడని చెబుతారు. అందువల్లే మైలాపూర్ కు శుక్రపురి అని పేరు.
నాలుగు వేదాలు ఆ పరమశివుడి ఇక్కడే అర్చించాయి. అందువల్లే ఈ మైలాపూర్ కు వేదపురి అని కూడా పేరు. ఈ మైలాపూర్ లోనే సుబ్రహ్మణ్యస్వామి తన ఆయుధమైన శక్తి వేల్ ను పార్వతి దేవి నుంచి పొందారని చెబుతారు.పరమేశ్వరుడిని కపాలీశ్వర్ అని పిలవడం వెనుక కూడా ఒక పురాణ కథ దాగిఉంది. దాని ప్రకారం ఒకసారి కైలాసంలో త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ చర్చలో బ్రహ్మ శివుడి పట్ల అహంకారంతో ప్రవర్తించి నిందిస్తాడు. దీంతో కోపగించుకొన్న పరమశివుడు ఆ బ్రహ్మ తలలో ఒక తలను నరికేస్తాడు.
బ్రహ్మ తన తప్పును తెలుసుకొని పాపపరిహారం కోరగా..మైలాపూర్ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాల్సిందిగా సూచిస్తాడు. అందుకే బ్రహ్మ మైలాపూర్ కు వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజిస్తాడు. అటు పై బ్రహ్మకు తన తల తిరిగి వస్తుంది. బ్రహ్మ తలను తిరిగి ఇప్పించాడు కాబట్టే ఇక్కడి పరమశివుడిని కపాలీశ్వర్ అని అంటారు. పరమశివుడు కపాలీశ్వర్ గా లింగ రూపంలో పూజలు అందుకొంటూ ఉంటే పార్వతీ దేవి కర్పాంగల్ పేరుతో భక్తులకు దర్శనమిస్తుంది. అంటే కోరిన కోర్కెలు తీర్చే చెట్టు అని అర్థం.