Supreme Court: ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ డాక్యుమెంటరీపై వివాదం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ డాక్యుమెంటరీని ఖండించింది. దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో బీబీసీ కార్యకలాపాలను భారత్లో నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఓ లఘచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదని ప్రశ్నించింది.
2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని మోదీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. దానిని ఇండియా: ది మోదీ క్వశ్చన్ పేరుతో రెండు భాగాలుగా రిలీజ్ చేసింది. దీంతో వివాదం చోటుచేసుకుంది. హిందూసేన చీఫ్ విష్ణు గుప్తాతో పాటు బీరేంద్ర సింగ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరుపున న్యాయవాది పింకీ ఆనంద్ వాదనలు వినిపించారు. భారత్కు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీబీసీ పనిచేస్తోందని ఆనంద్ ఆరోపించారు. భారత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ లఘు చిత్రాన్ని రూపొందించిందని.. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో దర్యాప్తు చేయించాలని కోరారు.
అయితే పిటిషనర్ తరుపున వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఓ లఘుచిత్రం దేశాన్ని ఎలా ప్రభావితం చేయగలదని పిటిషనర్లను ప్రశ్నించింది. ఈ పిటీషన్ విచారణకు అనర్హమని తెలిపింది.