MUKESH AMBANI: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలకంటే వేగంగా భారతీయులు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారత్ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. యూపీలోని లఖ్నవూలో జరుగుతోన్న ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు-2023లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్2023-24ను ప్రశంసించారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు పునాదులు వేసిందని అన్నారు. భారత ఆర్థిక పునాదుల్ని ప్రపంచంలో ఎవరూ ప్రశ్నించలేరని వెల్లడించారు. యూపీలో రానున్న నాలుగేళ్లలో దాదాపు రూ. 75,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 1 లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుందని చెప్పారు. అలాగే యూపీలోని ప్రతిగ్రామానికి, పట్టణానికి డిసెంబర్ నాటికి జియో 5జీ సేవలను విస్తరిస్తామని వెల్లడించారు.
అలాగే త్వరలో తమ కంపెనీ రిలయన్స్ జీవ ఇంధన రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. పంట వ్యర్థాల నుంచి గ్యాస్ను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఈ గ్యాస్ను వాహనాలు, వంటగదుల్లో కూడా ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.