తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్… భారత టెస్టు క్రికెట్లోకి ఎట్టకేలకు అరంగేట్రం చేశాడు. నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ కోసం… తుది జట్టులో అతనికి స్థానం కల్పించింది… జట్టు యాజమాన్యం. 2019లోనే టెస్టు జట్టుకు ఎంపికైన భరత్… తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2019లోనే బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ఎంపికైనా… తుది జట్టులో అవకాశం రాలేదు. రెండేళ్ల కిందట ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన స్టాండ్బై ఆటగాళ్లలోనూ భరత్ ఒకడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ కివీస్తో తలపడినప్పుడు… భరత్ సబ్స్టిట్యూట్ ఆటగాడిగా మైదానంలో అడుగుపెట్టాడు. సాహా గాయపడటంతో అతడి స్థానంలో వచ్చిన భరత్… రెండు క్యాచ్లు, ఒక స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లకు ఎంపికైనా… తుది జట్టులోకి ఎంపిక కాలేదు. రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ గాయపడి ఆటకు దూరం కావడంతో… వికెట్ కీపర్ కోటాలో టెస్టు జట్టులో ఛాన్స్ కొట్టేశాడు… భరత్. అది కూడా ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే బోర్డర్-గవస్కర్ ట్రోఫీలో… పూర్తి స్థాయి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం అతనికి దక్కింది. ఆట మొదలయ్యే ముందు… పుజారా చేతుల మీదుగా తన టెస్టు క్యాప్ను అందున్నాడు… భరత్.
ఇక వన్డేలు, టీ-20ల్లో టాప్ బ్యాటర్గా ఎదిగిన సూర్యకుమార్ యాదవ్ కూడా… భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఏడాదిన్నర కిందట టీ-20 జట్టులోనూ, ఆ తర్వాత వన్డే జట్టులోనూ స్థానం సంపాదించిన స్కై… తానేంటో నిరూపించుకున్నాడు. విధ్వంసకర ఆట ద్వారా… భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడయ్యాడు. గతంలో ఓసారి టెస్టులకు ఎంపికైనా… తుది జట్టులో స్కైకి స్థానం దక్కలేదు. ఇప్పుడు మిడిలార్డర్లో దూకుడుగా ఆడే రిషభ్ పంత్ లేకపోవడంతో… బ్యాటింగ్ కోటాలో సూర్యకు అవకాశం దక్కింది. మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా సూర్యకుమార్ తన టెస్టు క్యాప్ను అందున్నాడు.