Amigos: నటీనటులు: కల్యాణ్రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, జయప్రకాష్, సప్తగిరి తదితరులు
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: ఎస్. సౌందర్ రాజన్
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్
రచన, దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
విడుదల తేదీ: 10-02-2023
‘బింబిసార’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కల్యాణ్ రామ్.. ఇప్పుడు ‘అమిగోస్’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బింబిసార’లో ద్విపాత్రాభినయం చేసిన కల్యాణ్ రామ్ ‘అమిగోస్’లో మరో క్యారెక్టర్ను పెంచి తొలిసారి త్రిపాత్రాభినయం చేశాడు. కల్యాణ్రామ్ ఓ పాత్రలో ప్రతినాయకుడిగా కనిపిస్తుండటం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. టీజర్, ట్రైలర్కు మంచి స్పందన రావడం కూడా సినిమాకు ప్లస్ అయింది. దానికి తోడు హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న మైత్రీమూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రావడం.. నిర్మాణ సంస్థ సినిమా ప్రమోషన్స్ను కూడా గ్రాండ్గా నిర్వహించడంతో ‘అమిగోస్’పై హైప్ క్రియేట్ అయింది. మనిషిని పోలిన మనుషులు కలిస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం..
కథ:
హైదరాబాద్కు చెందిన సిద్ధార్థ్(కల్యాణ్రామ్) తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటుంటాడు. అతడికి పెళ్లి చేయడం కోసం ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. రేడియో జాకీగా పని చేసే ఇషిక(ఆషికా రంగనాథ్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో వాళ్ల ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తాడు. కానీ, ఆ వ్యవహారం బెడిసి కొడుతుంది. అదే సమయంలో సిద్ధార్థ్ ఓ వెబ్సైట్ వల్ల తనలాగే ఉండే మంజునాథ్ గౌడ్, మైఖేల్ను కలుసుకుంటాడు. ఈ ముగ్గురు గోవాలో కలుసుకొని బాగా క్లోజ్ అవుతారు. మంజు, మైఖేల్ సాయంతో సిద్ధార్థ్ తన ప్రేమను పెళ్లి పట్టాలెక్కిస్తాడు. ఆ తర్వాత సొంత ఊరు బెంగళూరుకు వెళ్లడానికి మంజునాథ్, కోల్కతాకు వెళ్లడానికి మైఖేల్ పయనమవుతారు. కానీ, ఇంతలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు మంజునాథ్పై కాల్పులు జరిపి.. అతన్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడే సిద్ధార్థ్కు మైఖేల్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తుంది. మైఖేల్ వెపన్ డీలర్ అని, అతడి అసలు పేరు బిపిన్ రాయ్ అని.. అతడిని పట్టుకోవడం కోసమే ఎన్ఐఏ వాళ్లు హైదరాబాద్కు వచ్చారని సిద్ధార్థ్ తెలుసుకుంటాడు. బిపిన్ చేసిన మోసం వల్ల మంజునాథ్, తాను సమస్యల్లో చిక్కుకున్నట్లు గ్రహిస్తాడు. అతడి ప్లాన్ను తిప్పికొట్టేందుకు సిద్ధార్థ్ ఎలాంటి ప్లాన్ వేశాడు? చివరకు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ:
అమిగోస్ అంటే ఏమాత్రం రక్త సంబంధం లేని మనిషిని పోలిన మనుషులు అని అర్థం. చూడ్డానికి అచ్చం ఒకేలా ఉండే ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. అందులో ఒకరు కథానాయకుడు.. ఒకరు ప్రతినాయకుడు. ఇంకొకరు అమాయకుడు. ఇలాంటి ముగ్గురు మనుషుల మధ్య జరిగే కథను దర్శకుడు రాజేంద్రనాథ్ రెడ్డి తెరకెక్కించిన విధానం బాగుంది. సిద్ధార్థ్ పాత్ర కోణం నుంచి కథ ఆరంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. ఆషికాతో అతని ప్రేమకథ కాస్త బోరింగ్గా అనిపించినా.. దాన్ని వెంటనే కట్ చేసి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఒకే పోలికలతో ఉన్న సిద్ధార్థ్, మంజునాథ్, మైఖేల్ ఒకచోటకు చేరాక కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్కు ముందొచ్చే మలుపుతో కథ ఒక్కసారిగా యాక్షన్ మోడ్లోకి టర్న్ తీసుకుంటుంది. మైఖేల్ వేసిన ఎత్తుగడ వల్ల మంజునాథ్ ఎన్ఐఏ బృందానికి చిక్కడం.. ఆ వెంటనే సిద్ధార్థ్కు మైఖేల్ అసలు రూపం తెలియడం.. ద్వితీయార్ధం ఏం జరుగుతుందన్న ఆసక్తి మొదలవుతుంది. ఇక ద్వితీయార్ధంలో మైఖేల్ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బిపిన్ రాయ్ అనే నరరూప రాక్షసుడిగా కల్యాణ్రామ్ను తెరపై చూపించిన విధానం బాగుంది. చిన్నపిల్లలను కూడా బలి తీసుకోవడం అతడిలోని క్రూరత్వాన్ని ఆవిష్కరించే సన్నివేశానికి ఉదాహరణ. అయితే క్లైమాక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందనే విషయాన్ని చివర్లో చూపించారు. సిద్ధార్థ్ నాలుగో డాపల్ గ్యాంగర్ మ్యాచ్ అయినట్లు హింట్ ఇచ్చారు.
నటీనటుల విశ్లేషణ:
ముందుగా కల్యాణ్ రామ్ విషయానికి వస్తే ఈ సినిమాలో అతడు తొలిసారి త్రిపాత్రాభినయం చేశాడు. సిద్దార్ధ్ అనే బిజినెస్ మెన్గా.. మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్గా.. ఇలా మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన కల్యాణ్ రామ్.. నటన, హవభావాల పరంగా మూడు పాత్రల్లోనూ చక్కటి వేరియేషన్ చూపించాడు. ముఖ్యంగా మైఖేల్గా ప్రతినాయకుడి పాత్రలో కల్యాణ్రామ్ కనిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ పాత్రే ఈ చిత్రానికి ప్రధాన బలం. దీనికి తన వంతుగా ప్రత్యేకత చేకూర్చడానికి కల్యాణ్రామ్ చేయాల్సిందంతా చేశాడు. మిగతా రెండు పాత్రలు కూడా ఆయా పాత్రల పరిధి మేరకు బాగున్నాయి. ఇక హీరోయిన్ ఇషికాగా ఆషికా రంగనాథ్ అందంగా కనిపించింది. బ్రహ్మాజీ పాత్ర అక్కడక్కడా కామెడీ పండిస్తుంది. ఇక సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతిక విశ్లేషణ:
డాపల్ గ్యాంగర్ అనే పాయింట్ను తీసుకుని సినిమా తీయాలనుకున్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవాలి. దర్శకుడి కథాలోచన బాగున్నా.. దాన్ని మరింత ఆసక్తికరంగా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది. స్క్రీన్ప్లే పరంగా అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపిస్తాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు ఒకట్రెండు మినహా మిగతావి ఆకట్టుకునేలా లేవు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. మైత్రీమూవీమేకర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.
రేటింగ్: 2.75/5
-బిల్లా గంగాధర్