Rajasthan Assembly : రాజస్థాన్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన జరిగింది. సభలో ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీఎం అశోక్ గెహ్లాట్ స్వయంగా బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. సభ్యులందరూ ఆసక్తిగా వింటున్నారు. అయితే ముఖ్యమంత్రి గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగంపై సభలోని సభ్యులకు ఏమీ అర్థం కాలేదు. అధికార పార్టీ సభ్యులు అయోమయానికి గురయ్యారు. విపక్ష బీజేపీ సభ్యులు ఎగతాళి చేశారు. అలా సీఎం గెహ్లాట్ బడ్జెట్ ప్రసంగం ఏడు నిమిషాల పాటు సాగింది.
ఇంతలో అసలు విషయం సీఎం గెహ్లాట్ కు ఆ తర్వాత అర్థమైంది. దీంతో నాలుక కరుచుకున్నారు. అంతే బడ్జెట్ ప్రసంగాన్ని ఆపేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ సభ్యులు సభలో ఆందోళనలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ సీపీ జోషి సభను 30 నిమిషాలపాటు వాయిదా వేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రాజస్థాన్ లో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో పాత బడ్జెట్ ప్రతులను అసెంబ్లీకి తీసుకొచ్చారు 2023-24 బడ్జెట్ను చదివే క్రమంలో గత బడ్జెట్ను చదివేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ పాత బడ్జెట్ను చదువుతున్నారనే విషయాన్ని హౌజ్ గ్యాలరీలో ఉన్న ఫైనాన్స్ ఆఫీసర్లు చీఫ్ విప్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసలు విషయాన్ని సీఎం గుర్తించారు. ఏకంగా సీఎం అశోక్ గెహ్లాటే తప్పులో కాలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.