RevanthReddy : తెలంగాణ ప్రభుత్వ విధానాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఐదో రోజు పాదయాత్ర కొనసాగిస్తున్న రేవంత్.. లచ్య తండాలో ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. టెండర్లు పిలవకుండానే అగ్రిమెంట్లు చేసుకున్నారని విమర్శించారు. ప్రైవేట్ సంస్థల నుంచి యూనిట్ పవర్ ను రూ. 14 కు కొంటున్నారని వెల్లడించారు. విద్యుత్ రంగంపై చర్చ జరగాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు లాభాలు చేకూర్చే కంపెనీలకు కేసీఆర్ కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్న కాంట్రాక్ట్ సంస్థకు అనుభవం లేదని వివరించారు. కమీషన్లు తీసుకుని ఆ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చేశారన్నారు. కాలం చెల్లిన టెక్నాలిజీతో ప్లాంట్ నిర్మిస్తున్నారని మండిపడ్డారు. అందుకే యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. అక్రమాలకు సహకకరించిన వారికే కేసీఆర్ పోస్టులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో 800 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.
మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించింది. ఇల్లందు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఉదయం లచ్యతండా నుంచి యాత్ర ప్రారంభమైంది. బర్లగూడెం, పోన్నెకల్లు, బండిపాడు ఎక్స్ రోడ్, గోవిందరాల, పాత లింగాల మీదుగా సాగుతుంది. కొత్త లింగాలలో సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇల్లందు రాజీవ్ నగర్ లో రాత్రి బస చేస్తారు.