Viveka Murder Case : వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి వద్ద పనిచేసే నవీన్ ను విచారించింది. ఇప్పుడు ఈ కేసులో నిందితులను సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. ఈ నేపథ్యంలో కడప కారాగారంలో ఉన్న నిందితులు ఏ2 సునీల్ కుమార్ యాదవ్, ఏ3 ఉమాశంకర్ రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కడప జైలు నుంచి తెల్లువారుజామున 4 గంటలకు హైదరాబాద్ కు తరలించింది.
వివేకా హత్య కేసులో ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ4 అప్రూవర్ మారిన దస్తగిరి బెయిల్ పై ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలకు సీబీఐ సమన్లు జారీ చేసింది. దీంతో వారిద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరితోపాటు మరో నిందితుడు ఉమాశంకర్రెడ్డిని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేసింది. నిందితుల్లో శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డి, సునీల్యాదవ్ ఇప్పటికే కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్గా మారిన దస్తగిరి బెయిల్పై బయట ఉన్నారు. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను ఇటీవల సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు సీబీఐ కోర్టు ఎస్సీ/01/2023 నంబర్ కేటాయించింది.
వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14న పులివెందులలోని తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తును అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్కు అప్పగించింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్.. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత హత్య కేసుపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది.
తన తండ్రి హత్య కేసులో సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో కేసు విచారణ జరిగితే తనకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. అందుకే మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. సునీత పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది.