RevanthReddy: రేవంత్ రెడ్డి తగ్గేదేలే. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టడంలో తగ్గేదేలే అంటున్నారు. బరాబర్ బద్దలు కొడతాం.. ప్రగతి భవన్ పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తాం అని తేల్చిచెప్పారు. ఉద్యమకారులకు, సామాన్య ప్రజలకు ఎంట్రీ లేనప్పుడు ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడితే తప్పేంటని ప్రశ్నించారు. గడీల పాలనకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమేనని.. ప్రగతి భవన్ పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. తప్పుడు కేసులు పెడితే భయపడే వ్యక్తిని కాదంటూ హెచ్చరించారు.
ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన డైలాగులు డైనమైట్లలా పేలుతున్నాయి. మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ సైతం బాగానే హర్ట్ అయినట్టున్నారు. అసెంబ్లీలో రేవంత్ మాటలను ప్రస్తావించారు. తాను చేసిన డైలాగ్ కు హ్యూజ్ రియాక్షన్ వస్తుండటంతో రేవంత్ రెడ్డి సైతం అదే టెంపో కంటిన్యూ చేస్తున్నారు. అయితే.. నక్సలైట్లు, పేల్చేయడం లాంటి పదాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుండటంతో తన వ్యాఖ్యలను మరింత పాలిష్ చేసే ప్రయత్నం చేశారు. గేట్లు బద్దలు కొడతాం.. ప్రగతి భవన్ పేరు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గా మారుస్తాం.. అంటూ కొత్త స్టేట్ మెంట్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలపై ఈసారి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రగతి భవన్ కు అంబేద్కర్ పేరు పెడతామనేదాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి.
ఇక, అసెంబ్లీలో ధరణి పోర్టల్ గురించి మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లపై రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ధరణి పోర్టల్ తో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రభుత్వ భూములను కేటీఆర్, అతని మిత్రపక్షం కొల్లగొట్టిందని ఆరోపించారు. కల్వకుంట్ల కవితకు మియాపూర్ లో 500 కోట్ల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కన్ స్ట్రక్షన్ కు ధరణి పోర్టల్ సాయంతో భూములు బదలాయించారని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను కొందరి పేర్లపై మార్చేశారని.. ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూములను కేటీఆర్ టీమ్ కొల్లగొట్టిందని.. తన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్ ను నిలదీశారు రేవంత్ రెడ్డి.